తెలంగాణలో కమలం వికసిస్తుందా?!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 10:14 AM GMT
తెలంగాణలో కమలం వికసిస్తుందా?!

తెలంగాణ‌లో యూపీ,బెంగాల్ ఫార్ములాలు వ‌ర్క్‌వుట్ అవుతాయా? .తెలంగాణ‌లో బీజేపీకి స్కోప్ ఉందా? క‌మ‌ల‌నాథుల ముందున్న స‌వాళ్లేంటి? ఉత్త‌రాది రాజ‌కీయ దండ‌యాత్ర ముగిసింది. ద‌క్షిణాదిపై క‌మ‌లం గురిపెట్టింది. క‌ర్నాట‌క‌లో ఇప్ప‌టికే పాగా వేసింది. కేర‌ళ‌లో టైమ్ ఉంది. త‌మిళ‌నాడులో పాచిక‌లు రెడీ చేసింది. కానీ ఏపీ,తెలంగాణ‌లో ప‌ట్టు సాధించ‌డం ఎలా? హ‌స్తిన బీజేపీ పెద్ద‌ల ముందున్న స‌వాల్ ఇది.

తెలంగాణ‌లో బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ అధికారంలో ఉంది. రాజ‌కీయ చాణ‌క్యుడు కేసీఆర్ సీఎంగా ఉన్నారు. గులాబీ ద‌ళాన్ని ఎదుర్కొని కాషాయ జెండా పాతాలి. ఇది బీజేపీ ముందు ఉన్న పెద్ద స‌వాల్‌. నార్త్ వేరు. సౌత్ వేరు. దీంతో బీజేపీ ఇక్క‌డ అధికారంలోకి రావ‌డం అంతా ఈజీ కాదు. టీఆర్ఎస్ బ‌లంగా ఉంది. ఇటు ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ కూడా పునాదులు గ‌ట్టిగా ఉన్నాయి. మూడో ఫోర్స్‌కు ఇక్క‌డ చాన్స్ ఉందా? అనేది పెద్ద ప్ర‌శ్న‌.

తెలంగాణ‌లో ప్ర‌స్తుత బీజేపీ ప‌రిస్థితి చూస్తే.....అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అప్ప‌టి వ‌ర‌కూ ఉన్న ఐదు సీట్లు కోల్పోయింది. గోషామ‌హ‌ల్ సీటుకు మాత్ర‌మే ప‌రిమితమైంది. పార్ల‌మెంట్ ఎన్నిక‌లు వ‌చ్చేస‌రికి...రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు,మోడీ వేవ్ క‌లిసి వ‌చ్చి నాలుగు ఎంపీ సీట్ల‌లో విజ‌యం సాధించింది. ఉత్త‌ర తెలంగాణ‌లో మూడు ఎంపీ సీట్లు సాధిస్తే....సికింద్రాబాద్ సీటును నిల‌బెట్టుకుంది.

ఈ నాలుగు ఎంపీ సీట్లతో రాబోయే కాలంలో బీజేపీ అధికారంలోకి వ‌స్తుందా? అంటే క‌ష్ట‌మే అని చెప్పొచ్చు. పొర్ల‌మెంట్ ఎన్నిక‌ల టైమ్‌లో కాలం క‌లిసివ‌చ్చింది. కాంగ్రెస్ నేత‌లు కొంద‌రు స‌హ‌క‌రించారు. అధికార టీఆర్ఎస్ అతి విశ్వాసంతో పోయింది. ఈ పాయింట్లు క‌లిసి వ‌చ్చి బీజేపీ నాలుగు సీట్లు గెలిచింది.

తెలంగాణలో పట్టు కోసం లోటస్ పక్కా వ్యూహం

తెలంగాణ‌లో ప‌ట్టు కోసం బీజేపీ ఒక వ్యూహంతో ముందుకెళుతోంది. యూపీ,బెంగాల్ ఫార్ములాలు ఇక్క‌డ అమ‌లు చేయాల‌ని అనుకుంటోంది. అందులో ప్ర‌ధాన‌మైంది. ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌ను వీక్ చేయాలి. అందులో భాగంగా కాంగ్రెస్ ప్ర‌ధాన ఓటు బ్యాంక్‌యైన ఎస్సీ,ఎస్టీలను బీజేపీ ఓటు బ్యాంక్‌గా మార్చాలి. అందుకోసం ఈ వ‌ర్గంలోని ప్ర‌ధాన నేత‌ల‌ను ఆక‌ర్షించాలి. ఇందులో భాగంగానే వివేక్ వెంక‌ట‌స్వామిని పార్టీలోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ఎస్టీ నేత‌ల‌ను కూడా త్వ‌ర‌లో చేర్చుకుంటార‌ట‌. ఇక కాంగ్రెస్ కు బ‌లమైన రెడ్డి నేత‌ల‌ను కూడా పార్టీలోకి తీసుకురావాల‌నేది ఓ ప్లాన్‌.

త‌ర్వాత టీఆర్ఎస్‌ను బ‌ల‌హీన‌ప‌ర్చ‌డం. ఆ పార్టీలోని నేత‌ల‌కు ఆక‌ర్ష్‌మంత్రం విస‌ర‌డం, అవినీతి కేసులు పెట్ట‌డం, ఐటీ,ఈడీ దాడుల‌తో చ‌క్ర‌బంధ‌నం చేయ‌డం. ఇందులో భాగంగా ఇప్పటికే టీఆర్ఎస్‌కు ఆర్దిక‌వ‌న‌రులు అంద‌జేస్తున్న పారిశ్రామిక వేత్త‌ల‌పై ఐటీ దాడులు ప్రారంభ‌మైన‌ట్లు తెలుస్తోంది. రాబోయే ఐదేళ్లలో ఇవి ఉధృతం అవుతాయ‌ని తెలుస్తోంది.

తెలంగాణపై బీజేపీ నేతల గురి

ఇక పార్టీప‌రంగా వ‌రుస కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ‌. ఇప్ప‌టికే బీజేపీ పార్టీ కార్య‌క్ర‌మాలు చాప‌కింద నీరులా జ‌రుగుతున్నాయి. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌తి వారం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. ఈ 54 రోజుల్లోనే 66 మంది జాతీయ బీజేపీ నేత‌లు తెలంగాణ‌లో ప‌ర్య‌టించారు. ఇందులో 18 మంది కేంద్ర‌మంత్రులు. వీరంతా ఒక్క హైద‌రాబాద్‌లో పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ప‌రిమితం కాలేదు. బీజేపీకి అంతో ఇంతో ప‌ట్టున్న ప్రాంతాల్లో తిరిగారు. ములుగు, ఏటూరు నాగారంతో పాటు రామగుండం, ఆదిలాబాద్‌, నిజామాబాద్, వ‌రంగ‌ల్‌,మ‌హూబూబ్‌న‌గ‌ర్‌లో ప‌ర్య‌టించారు. 370 ఆర్ఠిక‌ల్ ర‌ద్దుపై మేధావుల‌తో చ‌ర్చ కార్య‌క్ర‌మాలు కూడా న‌డిపారు.

మొత్తానికి తెలంగాణ‌లో ప్ర‌తి వ‌ర్గంలో ప‌ట్టు పెంచుకోవాల‌నేది బీజేపీ వ్యూహం. ఇప్ప‌టికే సింగ‌రేణి కార్మిక సంఘం నేత మ‌ల్ల‌య్య‌ను పార్టీలో చేర్చుకున్నారు. ఆర్టీసీ స‌మ్మెతో అక్క‌డి కార్మికుల‌కు మ‌ద్ద‌తు తెలిపింది. అక్క‌డ త‌మ కార్మిక సంఘం ఉనికి చాటి చెప్పేలా చూస్తోంది.

పట్టణ ప్రాంతాలపై బీజేపీ ఫోకస్

బీజేపీకి ముఖ్యంగా హైద‌రాబాద్‌లో ప‌ట్టుంది. నిజామాబాద్‌,క‌రీంన‌గ‌ర్‌, ఆదిలాబాద్‌లోని ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో కేడ‌ర్ ఉంది. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లోని కొన్ని ప‌ట్ట‌ణాల్లో ఆర్ఎస్ఎస్ కార్య‌క‌ర్య‌లు ఉన్నారు. ప‌ట్ట‌ణ ప్రాంతాలే టార్గెట్‌గా బీజేపీ విస్త‌ర‌ణ ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చిస్తోంది. ఇక్క‌డే వ‌రుస కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది.

మూడు నెల‌ల‌కు ఒక‌సారి అమిత్‌షా తెలంగాణ‌కు వ‌స్తున్నారు. పార్టీ విస్త‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఇటు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ న‌డ్డా కూడా దృష్టిపెట్టారు. అయితే ఇక్క‌డ నేత‌లు గ్రూపులుగా విడిపోవ‌డం పార్టీకి త‌ల‌నొప్పిగా మారింది. నాగం జనార్ధ‌న్‌రెడ్డి లాంటి నేత‌లు వ‌చ్చి పార్టీలో స‌ర్దుకుపోలేక‌పోయారు. దీంతో కొత్త నేత‌లు వ‌చ్చినా...పార్టీలో ఇమ‌డ‌లేక‌పోతున్నార‌నేది అంగీక‌రించాల్సిన నిజం.

బ‌ల‌మైన నేత‌లు పార్టీలోకి రాక‌పోవ‌డం కూడా బీజేపీకి మైన‌స్‌. అంతేకాకుండా కొన్ని రోజులు టీఆర్ఎస్‌తో వైరం..మ‌రికొన్ని రోజులు మిత్రుత్వం కొన‌సాగుతోంది. ఇది కూడా బీజేపీకి బ‌ల‌హీన‌త‌గా మారింది. టీఆర్ఎస్‌కు ప్ర‌త్యామ్నాయం బీజేపీ అని ఆ పార్టీ నేత‌లు చెప్పే మాట‌ల‌ను ప్ర‌జ‌లు విశ్వ‌సించ‌డం లేదు. మొత్తానికి బీజేపీకి మున్సిప‌ల్ ఎన్నిక‌లు ప‌రీక్ష‌గా మార‌బోతున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో గెలిచే సీట్లు,ఓట్ల శాతం బ‌ట్టే బీజేపీ తెలంగాణ‌లో ఎదుగుద‌ల ఉంటుంద‌నేది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌.

  • శ్రీధర్ , సీనియర్ జర్నలిస్ట్

Next Story