ప్రత్యర్దుల గుండెల్లో భారత్ 'అస్త్ర' మిస్సైల్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Oct 2019 8:56 AM GMT
ప్రత్యర్దుల గుండెల్లో భారత్ అస్త్ర మిస్సైల్‌

ఢిల్లీ: ఆయుధాల రూపకల్పనలో మనదేశం ఆరితేరుతుంది. ఇన్నాళ్లు అగ్ర దేశాలపై ఆధరాపడిన మనదేశం..ఇప్పుడు స్వదేశీ పరిజ్ఞానంతో అత్యున్నత క్షిపణులను తయారు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే డీఆర్డీవో, హాల్‌ సహా పలు ఆయుధ తయారీ సంస్థలు రేయింబవళ్లు శ్రమించి కొత్త కొత్త వెపన్స్ తయారు చేస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియాకు ఊతమిస్తూనే ప్రపంచదేశాల్లో ఆసక్తి రేపుతున్నాయి. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసై ల్, అస్త్ర మిస్సైల్సే అందుకు నిదర్శనం.

తొలిసారి దేశీయ పరిజ్ఞానం:

భారత సైన్యం అమ్ములపొదిలో బలమైన అస్త్రం 'బ్రహ్మోస్'. తాజాగా బ్రహ్మోస్ సూప‌ర్‌సోనిక్ క్రూయిజ్ మిస్సైల్‌ను విజ‌య‌వంతంగా ప‌రీక్షించారు. ఒడిశాలోని చాందిపూర్‌లో ఈ ప‌రీక్ష జ‌రిగింది. '290 కిలోమీట‌ర్ల' దూరంలో ఉన్న ల‌క్ష్యాన్ని ఛేదించే విధంగా పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో ప్రొప‌ల్షన్ సిస్టమ్, ఎయిర్‌ఫేమ్‌, ప‌వ‌ర్ స‌ప్లై తదితర దేశీయ కంపోనెంట్ల పనితీరును ప‌రీక్షించారు. అయితే బ్రహ్మోస్‌ మిస్సైల్‌ను భారత్‌, ర‌ష్యాలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ప్రస్తుతం ఈ మిసైల్‌ త్రివిధ దళాల వద్ద ఉంది. కానీ ఇప్పుడు టెస్ట్ చేసింది బ్రహ్మోస్‌లోని ల్యాండ్ అటాక్ వర్షన్‌. దీనిలో ప్రత్యేకంగా భారతదేశం తొలిసారి స్వంతంగా త‌యారు చేసిన ప‌రిక‌రాల‌ను ఈ క్షిప‌ణిలో ఉపయోగించారు. ఈ టెస్ట్‌తో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌కు మరింత బలం చేకూరనుంది.

Brhamos

'అస్త్ర' మిస్సైల్‌ విజయవంతం:

భారత ఆర్మీకి అందిన మరో పదునైన వెపన్..'అస్త్ర'. భారత వైమానికా దళం ఎయిర్‌-టు-ఎయిర్‌ క్షిపణి అయిన అస్త్ర పరీక్షను మంగళవారం విజయవంతంగా నిర్వహించింది. డీఆర్డీవో సరికొత్తగా అస్త్ర పేరుతో ఓ వెపన్‌ను తయారు చేసింది. దేశీయ పరిజ్ఞానంతో రూపొందించి.' అస్త్ర' ను సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధ విమానానికి అమర్చి గగన తలంలో ఈ పరీక్షను భారత రక్షణ శాఖ నిర్వహించింది.

' అస్త్ర' క్షిపణి ప్రత్యేకతలివీ..

కంటికి కనిపించని దూరాల్లో ఉన్న లక్ష్యాలను 'అస్త్ర' మిస్సైల్ విజయవంతంగా ఛేదిస్తుంది. అస్త్ర క్షిపణి మాక్ 4.5 వేగంతో ప్రయాణిస్తుంది. అన్ని రకాల వాతావరణాల్లోనూ గురితప్పకుండా లక్ష్యాలను ఛేదిస్తుంది. భారత వాయుసేనలోని సుఖోయ్, తేజస్ యుద్ధ విమానాలకు..' అస్త్ర' క్షిపణులు అతికినట్టు సరిపోతాయి. మార్గమధ్యంలో తప్పుదారి పట్టించేందుకు ప్రత్యర్థి యుద్ధవిమానాలు చేసే గిమ్మిక్కులను కూడా అస్త్ర సమర్థంగా ఎదుర్కొని పని పూర్తి చేయగలదు.

భారత్‌కు ప్రత్యేక గుర్తింపు:

' అస్త్ర' తరహా మిస్సైళ్లు ఇప్పటివరకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ వద్ద మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు ' అస్త్ర'కారణంగా మనదేశం కూడా ఆ దేశాల సరస న చేరింది. అన్ని పరీక్షలు పూర్తి చేసుకున్న ' అస్త్ర' త్వరలోనే భారత వాయుసేనలో చేరేందుకు సంసిద్ధంగా ఉంది. అయితే త్వరలోనే ' అస్త్ర'ను లాంగ్ రేంజ్ మిస్సైల్‌గా మలచడానికి డీఆర్డీవో కృషి చేస్తోంది.

Next Story