త‌క్ష‌ణ‌మే మ‌ర‌మ‌త్తులు చేప‌ట్టాలి : బ‌ండి సంజ‌య్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 July 2020 3:22 AM GMT
త‌క్ష‌ణ‌మే మ‌ర‌మ‌త్తులు చేప‌ట్టాలి : బ‌ండి సంజ‌య్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌క‌టించుకునే నిర్ణ‌యాల్లో కాళేశ్వ‌రం ప్రాజెక్టు ఒక‌టి. ఆ ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోస్తున్న నీటితో వివిధ ప్రాంతాల్లో సాగులోకి వ‌చ్చే భూమి గురించి స‌ర్కారు గొప్ప‌గా చెప్పుకొంటుంది. అయితే, తాజాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇలాకాలోనే పెద్ద‌ ఎత్తున నీటి లీకేజీ జ‌రిగింది. ఈ విష‌యంపై టీఆర్ఎస్ స‌ర్కారు పెద్ద‌గా స్పందించ‌క‌పోగా విప‌క్షాలు మాత్రం విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి. వారి విమ‌ర్శ‌లు రాజ‌కీయ కోణ‌మే అనుకునేంత తేలిక‌గా ప‌రిస్థితులు లేవ‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాజా ఘ‌ట‌న‌పై స్పందిస్తూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక లీకేజీల ప్రభుత్వమ‌ని ఎద్దేవా చేశారు. సీఎం సొంత నిజయోజకవర్గంలోనే ఇలా ఉంటే మిగతా చోట్ల ఇంకా ఎన్ని ఘోరాలు జరుగుతాయోనని అనుమానం వ్యక్తం చేశారు. స్కాముల కోసమే స్కీములు పెట్టారనడానికి కొండపోచమ్మ కాలువకు పడిన గండే సాక్ష్యమన్నారు. మొన్న కాళేశ్వరం, అంతకు ముందు మిడ్ మానేరు, మల్లన్న సాగర్, నేడు కొండపోచమ్మకు గండి ప‌డింద‌ని.. ఇలా నాణ్యత లేని ప్రాజెక్టుల వలన సమీప ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారన్నారు.

ప్రాజెక్టుల పేరు మీద నాణ్యత లేని పనులు చేపట్టి ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిందని బండి సంజ‌య్ ఆరోపించారు. కొందరు ప్రభుత్వ పెద్దల బినామీలు కాంట్రాక్టర్లు కావడమే ఈ లీకేజీలకు మూల కారణమ‌ని ఆరోపించారు. కాంట్రాక్టర్లతో ప్రభుత్వం కుమ్మక్కు కావడం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని ఆయ‌న ఆరోపించారు. ఈ లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, నాణ్యత లేని పనులు చేపట్టిన కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలన్నారు. కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ నుంచి ఈ మొత్తాన్ని రికవర్ చేసి తక్షణమే మరమత్తు పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

Next Story