అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ దారుణ హ‌త్య‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 March 2020 1:10 PM GMT
అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ దారుణ హ‌త్య‌

ఖమ్మం అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్న మోపు ఆనంద్ రెడ్డి దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు. గత నాలుగు రోజులుగా కనిపించకుండా పోయిన ఆనంద్ రెడ్డి మృత‌దేహాన్ని పోలీసులు జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా గొల్లబుద్ధారం అడవుల్లో కనుగొన్నారు.

వివ‌రాల్లోకెళితే.. ఈనెల ఏడోతేదీన ఆనంద్ రెడ్డి అతని స్నేహితుడు ప్రదీప్‌రెడ్డితో కలిసి బయటకు వెళ్లారు. తిరిగి ఇంటికి రాలేదు..ఆ రోజు నుంచి నాలుగు రోజులుగా ఆచూకీ లేకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆనంద్ రెడ్డి అదృశ్యంపై కుటుంబసభ్యులు హన్మకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రత్యేక బృందాలతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలావుంటే.. ఆనంద్ రెడ్డి స్నేహితుడు.. ప్రదీప్ రెడ్డి అప్ప‌టినుండి పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆనంద్ స్నేహితుడు.. ప్రదీప్‌రెడ్డి కోసం గాలిస్తున్న నేఫ‌థ్యంలో.. అత‌డి కారును హైదరాబాద్‌లోని అల్వాల్‌లో గుర్తించారు. హ‌త్య‌కు ఆర్థిక‌ లావాదేవీలు కార‌ణ‌మ‌ని తెలుస్తుంది. ఆనంద్ రెడ్డి హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Next Story