హైరిస్క్ జోన్లో సీతమ్మ ధార, అనకాపల్లి, గాజువాక ప్రాంతాలు
By అంజి Published on 24 March 2020 11:07 AM GMTఅమరావతి: రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. 220 మంది అనుమానితులకు పరీక్షలు చేయగా.. 168 మందికి నెగిటివ్ వచ్చిందన్నారు. మిగిలిన వారి నివేదికల కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. విశాఖ జిల్లాలో మూడు కరోనా కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు చేస్తున్న సేవలు అభినందనీయమని మంత్రి ఆళ్ల నాని అన్నారు. ఎంత చేసినా ఇంకా అప్రమత్తం అవ్వాలన్నారు. లాక్ డౌన్ ప్రకటించిన ఇంకా ప్రజలు సహకారం ఇవ్వాలన్నారు. వైద్య సిబ్బంది తమ కుటుంబాలను పక్కన పెట్టి సేవలు చేస్తున్నారని మంత్రి ఆళ్ల నాని అన్నారు. లాక్ డౌన్ విజయవంతం చేయాలని.. అప్పుడే వైరస్ వ్యాప్తిని అడ్డుకోగలమన్నారు.
విశాఖ జిల్లాలో కరోనా వైరస్ రెండవ దశలో అడుగుపెట్టిందని, విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని మంత్రి ఆళ్ల నాని చెప్పారు. మూడో దశలోకి రాకుండా విశాఖ వాసులు ప్రభుత్వ సూచనలు పాటించాలన్నారు. ఉచిత రేషన్ ఇస్తున్నామని, వచ్చే నెల 4 నుంచి ప్రతి ఇంటికి వెయ్యి రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలు ప్రభుత్వానికి తెలియజేయాలన్నారు. సీతమ్మ ధార, అనకాపల్లి, గాజువాక, అల్లిపురం ప్రాంతాలు హైరిస్క్లో ఉన్నాయని చెప్పారు. విశాఖలో 1472 మంది విదేశాల నుంచి నగరానికి వచ్చారని అన్నారు. వైద్య సిబ్బందికి మాస్క్లు, పీపీఏ కిట్లు ఉంచుతున్నామని తెలిపారు. ఔట్సోర్స్ ఉద్యోగులకు కూడా జీతాలిస్తున్నామన్నారు. విదేశాల నుంచి వచ్చిన వ ఆరు హోమ్ క్వారంటైన్ తప్పనిసరిగా పాటించాలన్నారు.
లాక్డౌన్ ప్రకటించిన అనవసరంగా రోడ్లపై తిరిగితే ఆ వాహనాలు సీజ్ చేస్తామన్నారు. ఈ సాయంత్రం నుంచి మరింత కఠిన ఆంక్షలు విధిస్తున్నామని మంత్రి కన్నబాబు తెలిపారు. ఫార్మా పరిశ్రమలు తక్కువ సిబ్బందితో పని చేయాలన్నారు. మీడియాపై నియంత్రణ లేదని, పోలీసు సిబ్బంది వారి విధులకు ఆటంకం కలిగించవద్దని తెలిపారు. జీవీఎంసీ మరింత గట్టిగా పని చేయాలన్నారు. రైతు బజార్లను స్కూల్ గ్రౌండ్స్, పెద్ద మైదనాల్లో నిర్వహిస్తామన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెంచిన వారిపై కేసులు నమోదు చేస్తామని మంత్రి కన్నబాబు హెచ్చరించారు.