ఏపీలో సిటిజెన్ హెల్ప్లైన్ కాల్ సెంటర్ ప్రారంభం
By అంజి Published on 25 Nov 2019 4:10 PM ISTఅమరావతి: రాష్ట్రంలో అవినీతిని పారద్రోలేందుకు సీఎం జగన్ సర్కార్ మరో అడుగు ముందుకేసింది. అవనీతిపై ఫిర్యాదుల కోసం సీఎం జగన్ కాల్ సెంటర్ ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ 14400 సిటిజెన్ హెల్ప్లైన్ కాల్సెంటర్ని ప్రారంభించారు. కాల్ సెంటర్కి సీఎం జగన్ నేరుగా ఫోన్ చేశారు. కాల్సెంటర్ పనితీరు, వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఎవరైనా లంచం అడిగితే 14400కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు. ఫిర్యాదు అందిన 15 రోజుల నుంచి నెల రోజుల్లో సమస్యను పరిష్కరించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. పైస్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రక్షాళన చేస్తామని తెలిపారు. అన్ని రంగాల్లో అవినీతిని అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటున్నామని.. రాష్ట్ర ప్రజలు ఈ సేవలను వినయోగించుకోవాలన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్. జగన్, పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ, డిజిపి గౌతం సవాంగ్, ఏసిబి ఉన్నతాధికారులు పోస్టర్ రిలీజ్ చేశారు.