రాజధాని తరలింపుపై హైకోర్టులో పిల్ దాఖలు..ఏజీ కీలక వ్యాఖ్యలు
By సుభాష్ Published on 24 April 2020 1:57 PM GMT
ఏపీ రాజధాని తరలింపుపై జేఏసీ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్ కోర్టుకు విన్నించారు. ఈ అంశంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని వికేంద్రీకరణకు ఉద్దేశించిన బిల్లును పాస్ కాకుండా రాజధాని తరలింపు ప్రక్రియ చేపట్టబోమని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు స్పష్టం చేశారు. కాగా, ఈ విషయంతో ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని ఏజీకి హైకోర్టు ఆదేశించింది.
అయితే ప్రమాణ పత్రం దాఖలుకు పది రోజుల సమయం కావాలని ఏజీ కోరగా, ప్రమాణ పత్రంకు పది రోజుల పాటు గడువిచ్చింది కోర్టు. కాగా, కేంద్ర ప్రభుత్వం కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈలోగా రాజధాని తరలింపుపై ఎలాంటి చర్యలు చేపట్టినా కోర్టు దృష్టికి తీసుకురావాలని పిటిషనర్లకు హైకోర్టు తెలిపింది.
అయితే రాజధాని తరలింపును ఆపడం ఎవరి తరం కాదని ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కాగా, పిటినర్ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఏజీని కోరింది. అలాగే అమరావతి పరిరక్షణ సమితి తరపున కార్యదర్శి గద్దె తిరుపతిరావు పిటిషన్ దాఖలు చేయగా, పిటిషనర్ తరపున న్యాయవాది వాదనలు వినిపించారు.