ఏపీ కేబినెట్‌ భేటీ.. మండలి రద్దుపై కీలక చర్చ

By అంజి  Published on  27 Jan 2020 4:17 AM GMT
ఏపీ కేబినెట్‌ భేటీ.. మండలి రద్దుపై కీలక చర్చ

అమరావతి: ఏపీ శాసనమండలి రద్దుపై ప్రభుత్వం నేడు నిర్ణయం తీసుకోనుంది. ఏపీ మంత్రివర్గం సమావేశం అయ్యింది. శాసనమండలి భవిత్యంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కాగా శాసనమండలిని రద్దుపై మంత్రివర్గం చర్చించనుంది. కేబినెట్‌ అనంతరం మండలిపై శాసనసభలో చర్చించనున్నారు. ఒకవేళ మండలిని రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే, అనంతరం శాసనసభలో మండలి రద్దుపై తీర్మానం పెట్టి ఆమోదించే ఛాన్స్‌లు ఉన్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభలో బిల్లులు ఆమోదం పొందిన తర్వాత జరిగిన పరిణామాలపై చర్చ జరగనుంది. తీర్మానం ఆమోదం పొందిన వెంటనే కేంద్రానికి పంపాలని యోచిస్తున్నారు.

కాగా ఇవాళ అసెంబ్లీకి వెళ్లకూడదని టీడీఎల్పీ నిర్ణయించుకుంది. మరోవైపు శాసనసభ, మండలి నిరవధిక వాయిదా పడిన అనంతరం ఆర్డినెన్స్‌ తీసుకువచ్చే అంశంపైనా మంత్రివర్గంలో సమాలోచనలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శాసనమండలి రద్దు చేసే ప్రకటనకు ముందు ఇద్దరు మంత్రులు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు. మండలిపై ప్రభుత్వ నిర్ణయంతో మంత్రులు పిల్లి సుభాష్‌, మోపదేవి తమ పదవులు కోల్పోనున్నారు.

మంత్రివర్గ సమావేశంలో భోగాపురం ఎయిర్‌పోర్టు, మచిలీపట్నం పోర్టులపై చర్చించనున్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి భూముల కేటాయింపుపై చర్చించనున్నారు.

Next Story