వైఎస్సార్ విద్యాకానుక పథకానికి కేబినెట్ ఆమోదం
By సుభాష్
వైఎస్ఆర్ విద్యాకానుక పథకానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 5 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. అలాగే నూతన పారిశ్రామిక విధానానికి ఏపీ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ నూతన పారిశ్రామిక విధానం 2020 నుంచి 2023 వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా నూతన విధానం రూపొందించినట్లు అధికారులు తెలిపారు.
ఇందులో భాగంగా ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామిక వేత్తలకు పోత్సాహకం అందించనున్నారు. అలాగే వైఎస్సార్ సంపూర్ణ పోషకాహార పథకానికి కూడా రాష్ట్ర మహిళలు, శిశువులకు సంబంధించి పూర్తి స్థాయిలో పోషకాహారం అందించే విధంగా ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఇక గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలపై కేబినెట్ చర్చించింది.
నవరత్నాల్లో భాగంగా మరో హామీ అమలు చేసే దిశగానే వైఎస్సార్ ఆసరా పథకం ప్రారంభించనున్నారు. ఈ పథకం వల్ల నాలుగేళ్లలో 27వేల కోట్లకుపైగా డ్వాక్రా మహిళలకు లబ్ది చేకూరనుంది. అలాగే పంచాయతీరాజ్ శాఖలో 51 డివిజనల్ డెవలప్మెంట్ అధికారుల పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.