పేద విద్యార్థులకు అండగా 'సీఎం జగన్' మామ
By అంజి Published on 23 Jan 2020 2:36 PM GMTనిరుపేద కుటుంబాల పిల్లల భవిష్యత్తు మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. అదే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ స్కూళ్లు తిరిగి తెరవడానికి ముందే జూన్ 1న ‘విద్యా కానుక’ కింద ప్రత్యేక కిట్లు అందజేస్తామని ఆయన ప్రకటించారు. అందులో విద్యార్థులకు అవసరమైనవన్నీ ఉంటాయన్న సీఎం.. 36.10 లక్షల విద్యార్థులకు ఆ కిట్లు పంపిణీ చేస్తామని తెలిపారు. ఇందుకోసం దాదాపు రూ.487 కోట్లు ఖర్చవుతాయన్నారు. అయినా నిరుపేద కుటుంబాల వారికి భారం కాకుండా ప్రభుత్వం ఆ మొత్తం భరిస్తుందని చెప్పారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బిల్లుపై సభలో జరిగిన చర్చలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. నిజానికి గత అసెంబ్లీ సెషన్లోనే ఈ బిల్లును ఆమోదించినప్పటికీ, కొన్ని సవరణలు కోరుతూ శాసన మండలి వెనక్కి పంపించింది. దీంతో గురువారం మరోసారి బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. మండలి కోరిన సవరణలను తిరస్కరిస్తూ, శాసనసభ మరోసారి ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తీసుకురావాలని, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలతో పాటు, అగ్రవర్ణాలలో ఉన్న పేద వారు కూడా ఆకాంక్షిస్తున్నారన్నారు. ప్రైవేటు స్కూళ్లలో వేలకు వేల ఫీజలు కట్టలేక, ఉచితంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం వస్తే తమ బతుకులు మారుతాయని చెప్పి దశాబ్దాల తరబడి వేచి చూస్తున్నారని సీఎం జగన్ అన్నారు. అయినా వారి గురించి పట్టించుకోని విధంగా వ్యవస్థ మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అందుకే ఈ నిర్ణయం?
పేద కుటుంబాల వారు తమ పిల్లలు ఫీజు చెల్లించాల్సిన పని లేకుండా, వారూ తమ పిల్లలను బడికి పంపించి, ఇంగ్లిష్ మీడియమ్లో చదవడం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియమ్ ప్రవేశపెట్టాలన్న నిర్ణయం తీసుకున్నామని సీఎం వెల్లడించారు.
ఇంగ్లిష్ మీడియం-శాతం
‘రాష్ట్రంలో 45 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ప్రాథమిక పాఠశాలల స్థాయి నుంచే ఇంగ్లిష్ మాట్లాడడం మొదలు పెడితే, పిల్లల భవిష్యత్తు ఇంకా మెరుగవుతుందన్నది సత్యం. ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలల్లో కేవలం 23.67 శాతం స్కూళ్లలో మాత్రమే ఇంగ్లిష్ మీడియం ఉంది. మొత్తం స్కూళ్లలో చూస్తే ఇంగ్లిష్ మీడియంలో ఉన్నవి 35 శాతం దాటలేదు. కానీ అదే ప్రైవేటు స్కూళ్లలో 98.5 శాతం పిల్లలు ఇంగ్లిష్ మీడియమ్లో చదువుతున్నారు’.
అంటే ఒక పద్ధతి ప్రకారం ఇనేళ్లు, పేదరికంలో ఉన్న పిల్లలు తెలుగు మీడియంలోనే చదవాలి అన్న ఒక కుట్రపూరితంగా వ్యవహరించారని.. ఈ పరిస్థితి మారాలి అని సీఎం జగన్ సృష్టం చేశారు.
ఇంగ్లిష్పై పట్టు ఉంటే?
మెరుగైన జీతాలు ఎవరికైనా రావాలంటే.. ఎక్కడైనా ఇంగ్లిష్ చక్కగా మాట్లాడగలిగితేనే అవి వస్తాయని, ఇవాళ ఆ పరిస్థితి ఉందని అన్నారు.
మరోసారి ఎందుకు?
అయితే ఇంతకు ముందే ఈ బిల్లు తీసుకువచ్చామని, ‘రైట్ టు ఎడ్యుకేషన్ కాదు.. రైట్ టు ఇంగ్లిష్ మీడియం’ అన్న కార్యక్రమం చేయాలన్న ఒక ధృఢ సంకల్పంతో మొత్తం ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లిష్ మీడియం చేయాలన్న తాపత్రయంతో కొన్నాళ్ల క్రితం అసెంబ్లీ గత సమావేశాల్లో బిల్లును తీసుకువచ్చామని సీఎం గుర్తు చేశారు. పేదలకు బాగు చేసే బిల్లు అని తెలిసినా మండలిలో అడ్డుకున్నారని, సవరణలు కోరుతూ తిరస్కరించారని తెలిపారు. అందుకే తిరిగి ఇప్పుడు మళ్లీ బిల్లు ప్రవేశపెట్టామన్న ముఖ్యమంత్రి, ఈసారి అడ్డుకోలేరని, మండలిలోనూ ఆమోదం పొందుతుందని తేల్చి చెప్పారు. పేదలకు న్యాయం చేసే ఈ అంశాన్ని ఆలస్యం చేయడానికి ఎందుకు పాకులాడుతున్నారో, ఎందుకంత తపిస్తున్నారో అర్ధం కావడం లేదని ఆయన అన్నారు. అమ్మ ఒడి.. ఇంగ్లిష్ మీడియమ్.. నాడు-నేడులో స్కూళ్ల మార్పు.. పిల్లలకు మధ్యాహ్న భోజన మెనూలో మార్పులు చేసి, దానికి ‘గోరుముద్ద’ అని పేరు పెట్టామని.. ఈ విధంగా ప్రతి అడుగులో కూడా పిల్లల జీవితాల మార్పు కోసం ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు.
విద్యా కానుక
‘అందులో భాగంగా జూన్ 12న స్కూళ్లు తెరవక ముందే జూన్ 1న, దాదాపు 36.10 లక్షల మంది పిల్లలకు స్కూల్ బ్యాగ్, పుస్తకాలు, నోట్బుక్లు, మూడు జతల యూనిఫామ్ (క్లాత్), షూస్, సాక్సులు, బెల్టుతో కూడిన కిట్లు ఇస్తున్నాం. ఒక్కో కిట్కు దాదాపు రూ.1355 ఖర్చు చేస్తూ, విద్యా కానుకగా ఇస్తున్నాం. ఇందు కోసం దాదాపు రూ.487 కోట్లు ఖర్చైనా ఫరవాలేదు.
ఆ భారం ఆ పిల్లల తల్లిదండ్రులపై పడకూడదన్న ఉద్దేశంతో విద్యాకానుక అమలు చేస్తున్నాము’ అని సీఎం వివరించారు.
చివరగా..
దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో ఇవన్నీ అమలు చేస్తున్నామన్న సీఎం జగన్, ఇలాంటివి మరిన్ని చేసే అవకాశం కల్పిస్తూ, ఈ బిల్లుకు మద్దతు తెలపాలని కోరుతూ ప్రసంగం ముగించారు.