విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు వైవీ సుబ్బారెడ్డి కౌంటర్
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరయ్యారు.
By Medi Samrat
ఏపీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి హాజరయ్యారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ కోటరీ గురించి వ్యాఖ్యలు చేశారు. కోటరీ వల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని అన్నారు. విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. అధికారంలో ఉన్నప్పుడు మా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి నాయకులతో, అధికారులతో చర్చించాకే నిర్ణయాలు తీసుకునేవారని వైవీ సుబ్బారెడ్డి అన్నారు
వైసీపీ నుంచి వెళ్లిపోయిన తర్వాత పార్టీపై ఏదోరకంగా అభియోగాలు మోపాలని విజయసాయి చూస్తున్నారని, ఆయన చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు చక్రం తిప్పింది విజయసాయేనని పార్టీలో కోటరీ ఉందో, లేదో ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. వైసీపీలో నెంబర్ 2 నుంచి 2 వేల స్థానానికి పడిపోయానని విజయసాయి అన్నారని, పార్టీలో నెంబర్ 2 అనేదే లేదని నెంబర్ వన్ నుంచి 100 వరకు అన్నీ జగనేనని సుబ్బారెడ్డి అన్నారు. వైసీపీ హయాంలో ఎలాంటి స్కాములు జరగలేదని, తమ పార్టీ నేతలపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని విమర్శించారు. లిక్కర్ స్కామ్ అంటూ కొందరిని భయపెట్టి లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారని సుబ్బారెడ్డి ఆరోపించారు.