చంద్రబాబును పొగిడిన వైసీపీ నేత.. అప్పుడు తెలిసేది టీడీపీ సత్తా అంటున్న అచ్చెన్న

YSRCP MLA Praises TDP Leader Chandrababu. వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత

By Medi Samrat  Published on  13 Jun 2022 9:08 AM GMT
చంద్రబాబును పొగిడిన వైసీపీ నేత.. అప్పుడు తెలిసేది టీడీపీ సత్తా అంటున్న అచ్చెన్న

వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ప్రశంసించారు. ఆత్మకూరు ఉప ఎన్నికలో భాగంగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామితో కలిసి సంగం మండలంలోని జంగాలకండ్రికలో జరిగిన బహిరంగ సభలో ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ వారిని మనం అభినందించాలని అన్నారు. చంద్రబాబుకున్న జ్ఞానం బీజేపీ వాళ్లకు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చనిపోతే, అదే కుటుంబం నుంచి ఎవరైనా పోటీలోకి దిగితే అక్కడ తమ అభ్యర్థిని నిలపబోమన్న సంప్రదాయాన్ని చంద్రబాబు పాటిస్తూ వస్తున్నారని, ఇందుకు మనం ఆయనను అభినందించాలని అన్నారు. ఆ మాత్రం జ్ఞానం బీజేపీ వాళ్లకు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు చనిపోయిన స్థానాల్లో వైసీపీ తన విధానం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. దిక్కుమాలిన సవాళ్లు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో మేకపాటి కుటుంబానికి టిక్కెట్ ఇవ్వకుండా ఉండి ఉంటే టీడీపీ పోటీ చేసేది అని అచ్చెన్నాయుడు తెలిపారు. గతంలోనూ టీడీపీ అదే విధానాన్ని పాటించిందన్నారు. తిరుపతి పార్లమెంటుకు మృతి చెందిన కుటుంబానికి టిక్కెట్ ఇవ్వకపోవడం వల్లనే తాము పోటీ చేశామన్నారు. ఆత్మకూరులోనూ మేకపాటి కుటుంబానికి టిక్కెట్ ఇవ్వకుంటే ఖచ్చితంగా పోటీ చేసి సత్తా చాటేవారమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. అప్పుడు తెలిసేది టీడీపీ సత్తా ఏంటో అని ఆయన అన్నారు.










Next Story