'పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గిస్తారు?'.. ప్రభుత్వానికి షర్మిల సూటి ప్రశ్న
పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు.
By అంజి
'పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గిస్తారు?'.. ప్రభుత్వానికి షర్మిల సూటి ప్రశ్న
అమరావతి: పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న పన్నులపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. పన్నులు ఘనం.. అభివృద్ధి శూన్యం.. ఇది రాష్ట్ర పరిస్థితి అంటూ విమర్శించారు. పెట్రోల్, డీజిల్ మీద పన్నులు తగ్గింపుపై టీడీపీ, వైసీపీ పార్టీలవి నీచ రాజకీయాలు అని, ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారపక్షంలో మరో మాట, గత 10 ఏళ్లుగా రెండు పార్టీల ప్రభుత్వాలు చేసింది దారి దోపిడీ తప్పా మరోకటి కాదన్నారు.
''రాష్ట్రంలో ఇవ్వాళ పెట్రోల్ ధర రూ. 109.60పైసలు. డీజిల్ ధర రూ 97.47 పైసలు. పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో లీటరు పెట్రోల్ ధర రూ.100.86పైసలు. డీజిల్ ధర రూ.92.39పైసలు. అంటే తమిళనాడుతో పోల్చితే మనదగ్గర పెట్రోల్ మీద 9 రూపాయలు, డీజిల్ మీద 5 రూపాయలు ఎక్కువ. కర్ణాటకలో లీటరు పెట్రోల్ ధర రూ.102.90పైసలు. డీజిల్ ధర రూ.88.99పైసలు. కర్ణాటకతో పోల్చితే ఏపీలో పెట్రోల్ మీద లీటరుకు 7 రూపాయలు, డీజిల్ మీద 9 రూపాయలు ఎక్కువ. పక్కనున్న తెలంగాణలో లీటరు పెట్రోల్ ధర. రూ 107.46పైసలు. డీజిల్ ధర రూ. 95.70పైసలు. తెలంగాణతో పోల్చినా ఏపీలో లీటరు మీద 3 రూపాయలు అదనం'' అని పేర్కొన్నారు.
వ్యాట్ పేరుతో ఏ రాష్ట్రంలో లేనంతగా ప్రజలపై పన్ను పోటు విధించారని దుయ్యబట్టారు. దేశంలోనే అత్యధిక పన్నులు వేసిన రాష్ట్రంగా ముందువరసలో పెట్టి.. రాష్ట్ర ప్రజానీకాన్ని లూటీ చేశారని ఆరోపించారు. చంద్రబాబు మొదటి 5 ఏళ్ల పాలనలో సుమారు రూ.20వేల కోట్ల మేర అదనపు పన్నులు వసూళ్లు చేస్తే.. నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ వైఎస్ జగన్ బాదుడే బాదుడు అంటూ ఎద్దేవా చేశారు. తీరా అధికారం ఇస్తే ఆయనే బాదుడుకి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. 5 ఏళ్లలో రూ.25 వేల కోట్ల మేర ఇంధనం మీద అదనపు పన్నులు వసూలు చేశారు. ఇద్దరు కలిసి 10 ఏళ్లలో ప్రజల నుంచి రూ.50వేల కోట్లు బాదేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. నాడు ప్రతిపక్షంలో ఉండగా పెట్రోల్, డీజిల్ ధరలను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. లీటరుకు 17 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఇంధనం ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎప్పటి నుంచి ధరలు తగ్గిస్తారో సమాధానం చెప్పాలి. 17 రూపాయలు ధర తగ్గించి ఇచ్చిన హామీ వెంటనే నిలబెట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పక్షాన వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.