దళిత క్రైస్తవుల రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ తీర్పు అణగారిన వర్గాల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, న్యాయం కంటే కోర్టు తొందరపాటే ఇందులో కనిపిస్తోందని ఆమె విమర్శించారు. రాజ్యాంగానికి రక్షకుడిగా ఉండాల్సిన సర్వోన్నత న్యాయస్థానం.. ఆర్టికల్ 14, 15, 25లను పరిగణనలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
కులం అనేది పుట్టుకతో వచ్చే సామాజిక వివక్ష అని, మతం మారినంత మాత్రాన దళితుల ఆర్థిక, సామాజిక స్థితిగతులు మారిపోవని ఆమె స్పష్టం చేశారు. ఎస్టీలు, బీసీలు మతం మారినా వారి హోదా కొనసాగుతున్నప్పుడు, కేవలం ఎస్సీల విషయంలోనే వివక్ష చూపడం అన్యాయమని మండిపడ్డారు. 1950 నాటి ఆర్డర్లోని నిబంధనలను సాకుగా చూపి దళిత క్రైస్తవులను విస్మరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఈ తీర్పు వల్ల రాష్ట్రంలోని 80 లక్షల మంది దళిత క్రైస్తవుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.