'దేనికి సిద్ధం జగన్ సారూ? మరో 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా?'.. షర్మిల ఫైర్‌

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. తాజాగా వైసీపీ చీఫ్‌, సీఎం వైఎస్‌ జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు.

By అంజి  Published on  8 Feb 2024 1:03 AM GMT
YS Sharmila, CM Jagan, YCP, Congress, APnews

'దేనికి సిద్ధం జగన్ సారూ? మరో 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా?'.. షర్మిల ఫైర్‌

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. తాజాగా వైసీపీ చీఫ్‌, సీఎం వైఎస్‌ జగన్‌పై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఫైర్‌ అయ్యారు. దేనికి సిద్ధం జగన్ సారూ? అంటూ ప్రశ్నించారు. మరో 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడానికి సిద్ధమా? అంటూ నిలదీశారు. ''మళ్లీ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా ? మళ్లీ ప్రత్యేక హోదాను బీజేపీ దగ్గర తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్లీ పూర్తి మద్యపాన నిషేధమని మోసం చేయడానికి సిద్ధమా? 25 లక్షల ఇళ్ళు కడతామని మోసం చేయడానికి సిద్ధమా ? లిక్కర్,మైనింగ్ మాఫియా కు సిద్ధమా ? దేనికి సిద్ధం?'' అంటూ తీవ్ర స్థాయిలో సీఎం జగన్‌పై షర్మిల విరుచుకుపడ్డారు.

మీరు సిద్ధమైతే...ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. బాపట్లలో జరిగిన భారీ బహిరంగ సభలో షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా సభకు తరలివచ్చి, ఘన స్వాగతం పలికిన జిల్లా ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు మద్దతు తెలిపిన ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటానన్నారు. వైయస్ఆర్ సంక్షేమ పాలన కాంగ్రెస్ తోనే సాధ్యమని చెప్పారు.

అంతకుముందు ''ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలు 5.5 కోట్ల ప్రజల హక్కు. వాటిని విస్మరించి, నిర్లక్ష్యం చేసి, రాష్ట్రాన్ని ఇంకా మోసం చేస్తూనే ఉంటే కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఇందులో భాగంగా, విభజన హామీలు జ్ఞ్యాపకం చేస్తూ కేంద్రంపై కలిసిపోరాడాలి''అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి, ప్రతిపక్ష నేత చంద్రబాబుకి వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖలు రాశారు. హామీలపై అసెంబ్లీ లో “ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు" తీర్మానం చేసి కేంద్రానికి, రాష్ట్రపతికి పంపాలని ఈ లేఖల్లో తమ డిమాండ్ ముందుంచామన్నారు.

Next Story