ప్రజాపక్షం అనిపించుకోండి.. జగన్కు షర్మిల సలహా
APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మరోమారు తన అన్నపై విమర్శలకు దిగారు. బడ్జెట్పై జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.
By Kalasani Durgapraveen Published on 14 Nov 2024 10:14 AM IST
APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మరోమారు తన అన్నపై విమర్శలకు దిగారు. బడ్జెట్పై జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. ఆమె ట్విటర్లో.. ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుంది YCP అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు అని ఎద్దేవా చేశారు. బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కానీ బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ.. YCP కంటే ముందుగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం.. మేము చెప్పిందే జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు.. మీకు మాకు పెద్ద తేడా లేదన్నారు. జగన్ మోహన్ రెడ్డికి 38 శాతం వచ్చినా.. అసెంబ్లీకి వెళ్ళనప్పుడు.. మీకు మాకు తేడా లేదన్నారు.
38 శాతం ఓట్ షేర్ పెట్టుకొని అసెంబ్లీకి పోనీ YCPని నిజానికి ఒక "ఇన్ సిగ్నిఫికెంట్"పార్టీగా మార్చింది జగన్ మోహన్ రెడ్డినే అన్నారు. అసెంబ్లీలో అడుగు పెట్టలేని, ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్టలేని, పాలకపక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని, అసమర్థ వైసీపీ ఇవాళ రాష్ట్రంలో అసలైన "ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ" అన్నారు.
ప్రజలు ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోడానికి కాదు.. సొంత మైకుల ముందు కాదు.. అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని.. మీకు చిత్తశుద్ది ఉంటే.. నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయండన్నారు. ప్రతిపక్షం కాకపోయినా.. 11 మంది ప్రజాపక్షం అనిపించుకోండని సలహా ఇచ్చారు.
ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామాలు చేయండని డిమాండ్ చేశారు. ఎన్నికలకు వెళ్ళండి.. అప్పుడు ఎవరు ఇన్ సిగ్నిఫికెంట్.. ఎవరు ఇంపార్టెంట్ తేలుతుంది కదా.. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలి.. లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలని సవాల్ విసిరారు. వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపుపై నిలదీయాలన్నారు.