రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విషపూరిత పాలు తాగి రెండు రోజుల్లోనే నలుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని, ఇది ప్రజలను భయాందోళనకు గురిచేస్తోందని పేర్కొన్నారు. కిడ్నీ సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్య పెరగడంపై ఆమె ఆవేదన చెందారు.
మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ తరపున సానుభూతి తెలిపిన షర్మిల, కూటమి ప్రభుత్వాన్ని పలు డిమాండ్లు చేశారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, బాధితుల సంఖ్య పెరగకుండా ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. కల్తీ పాల సరఫరా వెనుక ఉన్న నిజాలను నిగ్గుతేల్చేందుకు ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని, మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.