ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కు ప్రభుత్వం, పోలీసులు సహకరించారని కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య నువ్వు కొట్టినట్లు చెయ్యి, నేను ఏడ్చినట్లు చేస్తా అన్నట్లుగా వ్యవహారం నడుస్తోందని షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. మామిడి రైతులు ధరలు పతనమై కన్నీరు పెడుతుంటే, ఈ రెండు పార్టీలు రాజకీయ డ్రామాలకు తెరలేపాయని ఆరోపించారు.
బంగారుపాళ్యంలో వైఎస్ జగన్ పర్యటనను ఆమె ఓ పెద్ద నాటకమని, కూటమి ప్రభుత్వ దర్శకత్వంలో, పోలీసుల సహకారంతో ఈ బంగారుపాళ్యం వైసీపీ మామిడికాయ సినిమాను రక్తి కట్టించారన్నారు. పరామర్శల పేరుతో వేలాది మందితో బలప్రదర్శన చేస్తుంటే, ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించిందని విమర్శించారు. తోతాపురి రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని షర్మిల దుయ్యబట్టారు. కిలోకు 16 రూపాయలు ఇస్తే తప్ప తాము కోలుకోలేమని రైతులు వేడుకుంటుంటే, మార్కెట్లో 4 రూపాయలకు మించి ధర పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రైతుల కోసం జగన్ చేస్తున్న పోరాటం కాదని, కేవలం డబ్బుతో కూడిన బలప్రదర్శన అని షర్మిల స్పష్టం చేశారు.