వైసీపీ అధినేత జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో గుంటూరు ఏటూకూరు బైపాస్ వద్ద ఓ వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి చనిపోయిన విషయం తెలిసిందే. ఆ వాహనం జగన్దేనని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా.. తాజాగా ఓ షాకింగ్ వీడియో ప్రత్యక్షం అయ్యింది. జగన్ తన వాహనం నుంచి అభివాదం చేస్తూ వెళ్తుండగా, ఆయన కారు కిందే సింగయ్య పడినట్టు అందులో ఉంది దీన్ని పోలీసులు, అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.
ఈ వీడియో వెలుగులోకి రాకముందు సింగయ్య మృతిపై ఎస్పీ మీడియాతో మాట్లాడారు. గుంటూరు ఏటూకూరు బైపాస్ వద్ద మాజీ సీఎం జగన్ కాన్వాయ్ ఢీకొని సింగయ్య చనిపోయినట్టు జరుగుతున్న ప్రచారంపై ఎస్పీ సతీష్ స్పందించారు. ఉదయం 9.30 గంటల సమయంలో వెంగళాయపాలెనికి చెందిన సింగయ్య అనే వ్యక్తి టాటా సఫారీ తగిలి పడిపోయారని, ఆ తర్వాత ఆయన్ను కొందరు రోడ్డు పక్కన పడుకోబెట్టారని చెప్పారు. పోలీసులు వచ్చే వరకూ ఎవరూ పట్టించుకోలేదని, అతడిని జీజీహెచ్కు పోలీసులు తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్టు ఎస్పీ వెల్లడించారు.
మాజీ సీఎం జగన్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తి చనిపోయినట్టు టీడీపీ సోషల్మీడియాలో ఆరోపించింది. జగన్ ప్రచార పిచ్చికి మరొకరు బలయ్యారని, ఏటూకూరు బైపాస్ దగ్గర రోడ్డు మీద వెళ్తున్న వ్యక్తిని జగన్ కాన్వాయ్ ఢీకొట్టిందని టీడీపీ ఆరోపించింది.