'ప్రజలే గుణపాఠం చెప్తారు'.. సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ తీవ్ర విమర్శలు

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి)లో ప్రజల తీర్పును తారుమారు చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ ఆరోపించారు.

By అంజి
Published on : 20 April 2025 7:04 AM IST

YS Jagan, CM Chandrababu Naidu, Mayor Post Row, APNews, Vizag

'ప్రజలే గుణపాఠం చెప్తారు'.. సీఎం చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ తీవ్ర విమర్శలు

గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జివిఎంసి)లో ప్రజల తీర్పును తారుమారు చేయడానికి టిడిపి అధినేత, ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీచేస్తున్నారని ఆరోపించారు. ప్రజలిచ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ, గూండాయిజం చేస్తూ, ప్రలోభాలు, బెదిరింపులకు దిగి విశాఖపట్నం మేయర్‌గా ఉన్న బీసీ మహిళను పదవినుంచి దించేయడం, సీఎం చంద్రబాబు చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యమని అన్నారు.

''ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం 98 డివిజన్లు ఉన్న విశాఖపట్నం కార్పొరేషన్‌లో వైయస్సార్‌సీపీ గుర్తుపై పోటీచేసి 58 స్థానాలను మా పార్టీవాళ్లు గెలుచుకోగా, టీడీపీ కేవలం 30 సీట్లు మాత్రమే గెలిచింది. మరి మీకు మేయర్‌ పదవి ఏరకంగా వస్తుంది? బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ యాదవకులానికి చెందిన మహిళను మేం మేయర్‌ పదవిలో కూర్చోబెడితే, మీరు అధికార దుర్వినియోగంచేస్తూ, కోట్లాది రూపాయలతో ప్రలోభపెట్టి, పోలీసులను దుర్వినియోగం చేస్తూ, బెదిరిస్తూ, అప్పటికీ లొంగకపోతే మా పార్టీ కార్పొరేటర్లు విడిది చేసిన హోటల్‌పై మీ నాయకులతోనూ, పోలీసులతోనూ దాడులు చేయించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరా వీడియోలు ఇప్పుడు ప్రజల ముందే ఉన్నాయి. మరి దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? అవిశ్వాసం ప్రక్రియ స్వేచ్ఛగా జరిగిందని అనుకోవాలని అంటారా? అధికార దుర్వినియోగం కాదా ఇది?'' అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

''మరో ఏడాది గడిస్తే ఇప్పుడున్న కౌన్సిల్‌ పదవీకాలం పూర్తవుతుందని తెలిసీ, మళ్లీ ఎన్నికలు వస్తాయని తెలిసి కూడా, ప్రజలకు ఫలానా మంచి చేశాను అని చెప్పి ఓట్లు అడిగే ధైర్యం చంద్రబాబు.. మీకులేదు. అందుకే అన్యాయమైన రాజకీయాలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని సమాధి చేస్తున్నారు. మీ అప్రజాస్వామిక విధానాలకు దేవుడు, ప్రజలే గుణపాఠం చెప్తారు'' అని పేర్కొన్నారు.

Next Story