చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో మహిళపై జరిగిన దాడిపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసిన ఘటనపై వైఎస్ జగన్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఇది నిదర్శనం అంటూ ధ్వజమెత్తారు. మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా?. సాక్షాత్తూ మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి, హింసిస్తున్న ఘటన, మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమేనని విమర్శించారు.
అప్పు తీర్చలేదని కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో మహిళను చెట్టుకు కట్టేసి అమానవీయంగా వ్యవహరించిన ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తిమ్మరాయప్ప అనే వ్యక్తి మునికన్నప్ప వద్ద కొంత అప్పు తీసుకున్నారు. అప్పుల భారం భరించలేక తిమ్మరాయప్ప గ్రామం వదిలి వెళ్లిపోయారు. ఈ క్రమంలో తిమ్మరాయప్ప భార్యను అప్పు చెల్లించాలని గొడవపడి మునికన్నప్ప, ఆయన కుటుంబ సభ్యులు ఆమెను చెట్టుకు కట్టేశారు. వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు బాధితురాలి పట్ల దారుణంగా ప్రవర్తించిన మునికన్పప్పతో పాటు అతని కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.