భ్రష్టుపట్టించారు.. చంద్రబాబు, లోకేష్ ఫెయిల్ : వైఎస్ జగన్

పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో తప్పులు చాలా జరిగాయని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

By Medi Samrat
Published on : 31 May 2025 6:27 PM IST

భ్రష్టుపట్టించారు.. చంద్రబాబు, లోకేష్ ఫెయిల్ : వైఎస్ జగన్

పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనంలో తప్పులు చాలా జరిగాయని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్‌ టెన్త్‌ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యారని, మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయిందని విమర్శించారు.మీరు చేసిన తప్పులు కారణంగా ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్‌ కాలేజీలు సహా ఇతరత్రా అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రబాబుగారూ దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు.

"1.

@ncbn

గారూ.. మీరు, మీ కొడుకు విద్యాశాఖ మంత్రి లోకేష్‌ టెన్త్‌ పరీక్షల నిర్వహణలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యారు. మీ పాలనలో విద్యారంగం భ్రష్టుపట్టిపోయింది. మీ అవివేక, అనాలోచిత, పరిణితిలేని నిర్ణయాలతో విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కష్టాలే ఎదురవుతున్నాయి. 10వ తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనాన్ని కూడా సరిగ్గా నిర్వహించలేని దుస్థితిలో ఉన్న మీరు, మిగతా వ్యవస్థలను ఇంకా ఎంత ఘోరంగా నడుపుతున్నారో అర్థం అవుతోంది.

2.6.14 లక్షల మంది రాత్రీపగలూ కష్టపడి చదివి పరీక్షలు రాస్తే, జవాబు పత్రాలను సరిగ్గా దిద్ది, పారదర్శకంగా ఫలితాలు వెల్లడించాల్సిన మీరు, ఘోరంగా విఫలమై, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్షోభకు గురిచేశారు. ఇప్పుడు ప్రతి స్టూడెంట్‌కూడా తన మార్కుల జాబితాపై అనుమానాలు వ్యక్తంచేసే పరిస్థితిని తీసుకు వచ్చారు. మీరు చేసిన తప్పులు కారణంగా ట్రిపుల్ ఐటీ, గురుకుల జూనియర్‌ కాలేజీలు సహా ఇతరత్రా అడ్మిషన్లలో విద్యార్థులు అన్యాయమైపోయిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. చంద్రబాబుగారూ దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? అసలు పరీక్షల నిర్వహణ సమయంలోనే మీ బేలతనం బయటపడింది. ప్రశ్నపత్రాలు లీకేజీ అయ్యాయి. అయినాసరే తప్పులను సరిదిద్దుకోకపోవడం మీ అసమర్థతకు నిదర్శనం కాదా?

3.మన రాష్ట్రంలో చదివే ప్రతి విద్యార్థి ప్రపంచస్థాయిలో పోటీని ఎదుర్కొనేలా తీసుకొచ్చిన అనేక సంస్కరణలను వచ్చీరాగానే దెబ్బతీశారు. స్కూళ్లలో నాడు-నేడు, గోరుముద్ద, ఇంగ్లీషు మీడియం, సీబీఎస్‌ఈ నుంచి ఐబీ వరకూ ప్రయాణం, 3వ తరగతి నుంచే టోఫెల్‌ క్లాసులు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు, 3వ తరగతి నుంచే సబ్జెక్టుల వారీగా బోధన ఇలా ప్రతి మంచి కార్యక్రమాన్ని కక్షగట్టి నీరుగార్చారు. తల్లులను ప్రోత్సహిస్తూ ఇచ్చే అమ్మ ఒడిని రద్దుచేశారు. ఇప్పుడు పరీక్షలు నిర్వహణ, ఫలితాల వెల్లడిలోనూ విఫలమవుతున్నారు.

4.చంద్రబాబుగారూ… మీరు చేసిన తప్పుల వల్ల విద్యార్థులు బలైపోవడానికి వీల్లేదు. ఎలాంటి ఫీజు లేకుండా కోరిన ప్రతి విద్యార్థి జవాబు పత్రాలను రీవాల్యుయేషన్‌ చేయండి. తుది ఫలితాలు వచ్చేంతవరకూ టెన్త్‌ మార్క్స్‌ ప్రాతిపదికగా చేస్తున్న అడ్మిషన్లను కొన్నిరోజులపాటు నిలిపివేయండి. తప్పులకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి లోకేష్‌తో మొదలు అందరిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నాను." అంటూ వైఎస్ జగన్ నాలుగు పాయింట్లతో ట్వీట్ వేశారు.

Next Story