వైసీపీ అధినేత వైఎస్ జగన్ మాట్లాడుతూ అన్యాయాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సమయం వచ్చినప్పుడు కచ్చితంగా సినిమా చూపిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదన్నారు. కేసులకు, జైళ్లకు బెదిరిపోకూడదని, అలా అయితేనే రాజకీయాలు చేయగలమన్నారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే ఖూనీ చేస్తున్నారని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తిరువూరు వంటి ప్రాంతాల్లో వైసీపీకి సంఖ్యాబలం ఉన్నప్పటికీ, టీడీపీ పోటీకి దిగడం, వైసీపీ ఆధిక్యం ఉంటే ఎన్నికలను నిలిపివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసుకోండి. అన్యాయం చేయాలనుకుంటే చేయమనండి, కొడతానంటే కొట్టమనండి. కానీ, మాకూ సమయం వస్తుంది. అప్పుడు అన్యాయాలు చేసిన ప్రతి ఒక్కరికీ సినిమా చూపిస్తామన్నారు వైఎస్ జగన్. రిటైర్ అయిన వారిని కూడా లాక్కొచ్చి తీరుతామని, దేశం విడిచి పారిపోయినా రప్పిస్తామని జగన్ హెచ్చరించారు. ఒక కేసులో బెయిల్ వస్తే, వెంటనే మరో కేసు నమోదు చేస్తున్నారని, వల్లభనేని వంశీ విషయంలోనూ ఇలాగే వ్యవహరించారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడైన నందిగం సురేష్ను కూడా అన్యాయంగా నెలన్నరకు పైగా జైల్లో ఉంచి, బయటకు వచ్చిన తర్వాత మళ్లీ కేసు పెట్టి జైలుకు పంపారని అన్నారు.