చంద్రబాబు పేరు చెబితే ఏ సంక్షేమ పథకమైనా గుర్తొస్తుందా.? : వైఎస్ జగన్

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ది గురించి కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన

By Medi Samrat  Published on  6 Feb 2024 12:45 PM GMT
చంద్రబాబు పేరు చెబితే ఏ సంక్షేమ పథకమైనా గుర్తొస్తుందా.? : వైఎస్ జగన్

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. తమ ప్రభుత్వం చేసిన అభివృద్ది గురించి కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఆయన మామగారైన ఎన్టీఆర్​ను వెన్నుపోటు పొడిచి సీఎం సీట్లో కూర్చొన్నారని సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఏ సంక్షేమ పథకమైనా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. అన్ని సామాజిక వర్గాలను మోసం చేసి, ఇప్పుడు మళ్లీ అవకాశం ఇమ్మని అడుగుతున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏంచేశారని ప్రశ్నించారు. ఏపీ ప్రజలను మోసం చేసేందుకు జాతీయ పార్టీలతో అవగాహన కుదుర్చుకొని కుట్రలు, కుతంత్రాలు, పొత్తులు పెట్టుకుంటున్నారన్నారు. 650 హామీలిస్తే 10 శాతం కూడా అమలు చేయలేదని, ఎన్నికల తరువాత మ్యానిఫెస్టో చెత్తబుట్టలోకి వెళతుందని జోస్యం చెప్పారు.

ఏపీ ప్రభుత్వం ఏడాదికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తే.. శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని.. చంద్రబాబు కొత్త వాగ్ధానాలకు ఏడాదికి రూ.73 వేల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు సీఎం జగన్. ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ కలుపుకుంటే రూ.2 లక్షల 26 వేల 140 కోట్లు ఖర్చు అవుతుంది.. మరి అప్పుడు రాష్ట్రం ఏమవుతుందని ప్రశ్నించారు సీఎం జగన్. సంపద సృష్టించానని బాబు ప్రతీ మీటింగ్‌లో చెబుతున్నారు.. చంద్రబాబు సీఎంగా ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో రెవెన్యూ లోటు ఉందని తెలిపారు జగన్. చంద్రబాబు బాబు సంపద సృష్టిస్తే.. రెవెన్యూ లోటు ఎందుకు వస్తుందని సీఎం జగన్ ప్రశ్నించారు.

Next Story