'నిజం గెలిస్తే.. జీవితాంతం బాబు జైల్లోనే'.. కొడాలి నాని సెటైర్లు

నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. తాజాగా ఈ యాత్రపై వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు.

By అంజి  Published on  25 Oct 2023 6:07 AM GMT
YCP, Kodali Nani, Nara Bhuvaneshwari, Nijam gelavali, bus yatra, APnews

'నిజం గెలిస్తే.. జీవితాంతం బాబు జైల్లోనే'.. కొడాలి నాని సెటైర్లు

టీడీపీ చీఫ్‌ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి 'నిజం గెలవాలి' పేరుతో బస్సు యాత్ర చేపట్టారు. తాజాగా ఈ యాత్రపై వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు జైలులో ఉన్నాడని నాని అన్నారు. భువనేశ్వరి కూడా నిజం గెలవాలనుకుంటే చంద్రబాబు జీవితంలో బయటకు రాడన్నారు. చంద్రబాబు కుటుంబమంతా అవినీతి సొమ్ముతో మునిగిపోయిందని కొడాలి నాని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు? భువనేశ్వరి ఏ స్థాయిలో ఉందని ప్రశ్నించారు. రెండు ఎకరాలతో ప్రారంభమైన చంద్రబాబు ప్రస్థానం నేడు రూ. 2 వేల కోట్లు దాటిందన్నారు. 40 రోజుల్లో ఢిల్లీ లాయర్లకు రూ. 35 కోట్లు ఏ విధంగా ఫీజులు కట్టారని ప్రశ్నించారు. కష్టపడి పొలం దున్నగా వచ్చిన డబ్బుతోనే రూ.7 కోట్లతో రూపొందించిన బస్సులో యాత్ర చేస్తున్నారా? అని అడిగారు.

గత ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్‌ తెరచాటుగా టీడీపీకి మద్దతు ఇచ్చాడని, ఇప్పుడు ఆ ముసుగు తొలగింది అంతేనని అన్నారు. చంద్రబాబు కోసమే పవన్‌ జనసున్నా పార్టీ పెట్టాడని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వారసుడు లోకేష్ సమర్థుడు, మగాడు అయితే ఇంట్లో మహిళలు రోడ్లపైకి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. లోకేష్ పప్పు అని మరోసారి రుజువైందని.. ఢిల్లీ పారిపోయి తల్లిని రోడ్లపై తిప్పుతున్నాడని కొడాలి నాని విమర్శించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో నిజం గెలవాలనే పేరుతో నారా భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను ఇవాళ ప్రారంభించనున్నారు. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుండి చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్‌లో ఉన్నారు.

Next Story