గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి రాష్ట్ర పౌరులకు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి 161 సేవలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం నుంచి ఫోన్‌లలో వాట్సాప్ సిస్టమ్ ద్వారా 161 ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించనుంది.

By అంజి  Published on  30 Jan 2025 8:16 AM IST
WhatsApp governance, APnews, CM Chandrababu

నేటి నుంచి ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్‌ సేవలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం నుంచి ఫోన్‌లలో వాట్సాప్ సిస్టమ్ ద్వారా 161 ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించనుంది. బుధవారం అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు వాట్సాప్‌ గవర్నెన్స్‌ సిస్టమ్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. జనవరి 30న ఈ సర్వీసును ప్రారంభించనున్న ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రికి వాట్సాప్‌ గవర్నెన్స్‌పై అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. వాట్సాప్‌ సిస్టమ్‌ ద్వారా 161 సేవలు అందుబాటులో ఉంటాయి. త్వరలో మరిన్ని సేవలు సిస్టమ్‌కు జోడించబడతాయి.

ఎండోమెంట్స్, ఇంధనం, APSRTC, రెవెన్యూ, అన్నా క్యాంటీన్లు, CMRF, పురపాలక పరిపాలన వంటి శాఖల సేవలు తక్షణమే అందుబాటులో ఉంటాయి. సర్టిఫికెట్ల కోసం పౌరులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే విధానానికి ఇక నుంచి స్వస్తి పలకనున్నట్లు నాయుడు తెలిపారు. అదే సమయంలో పౌరుల సమాచారం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఫోరెన్సిక్‌, సైబర్‌ సెక్యూరిటీ వింగ్‌లను పటిష్టం చేయాల్సిన అవసరాన్ని సీఎం నొక్కి చెప్పారు. ఈ సేవలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 22న మేటాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ప్రజాసేవలు వేగంగా అందజేస్తామని చెప్పారు.

Next Story