తిరుమలకు ఫ్రీబస్సుపై మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు

కూటమి ప్రభుత్వం మహిళామూర్తులకు సూపర్ సిక్స్ పథకం లో భాగంగా అందించిన మరో కానుక స్త్రీ శక్తి సూపర్ సక్సెస్ అయిందని రవాణాశాఖామంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు

By Medi Samrat
Published on : 20 Aug 2025 4:14 PM IST

తిరుమలకు ఫ్రీబస్సుపై మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు

కూటమి ప్రభుత్వం మహిళామూర్తులకు సూపర్ సిక్స్ పథకం లో భాగంగా అందించిన మరో కానుక స్త్రీ శక్తి సూపర్ సక్సెస్ అయిందని రవాణాశాఖామంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. స్త్రీ శక్తి పథకం సక్సెస్ సందర్భంగా పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ ఆవరణలోని కాన్ఫరెన్స్ హాల్ లో ఏపీఎస్ ఆర్టీసీ అధికారులతో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ పథకాలు ఒక్కోక్కటి ఒక్కో విశిష్టత కలిగి ఉన్నాయని, వాటిలో మహిళామూర్తులకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చే స్త్రీ శక్తి పథకం విజయవంతం కావడం అభినందనీయమన్నారు. ఉచిత బస్సు పథకం అమలుకు ముందు పక్క రాష్ట్రాల్లో పథకం అమలు తీరును అధ్యాయనం చేసిన తరువాతనే మన రాష్ట్రంలో పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన మహిళలకు ఉచిత బస్సు పథకమని ఇందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలిపారు. పథకం అమలు తీరులో చిన్న చిన్న లోటుపాట్లు సహజమని, ఒడిదుడుకులను తట్టుకుని సద్విమర్శలను పరినణలోకి తీసుకుని పథకంను విజయవంతం చేయడంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు.

స్త్రీ శక్తి పథకం అమలు ప్రభుత్వానికి భారం కాదని, బాధ్యత అని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్నింటిలో స్త్రీ శక్తి పథకం టాప్ లో ఉంటుందన్నారు. ఈ ఆరు రోజుల్లో 65 లక్షల మందికి పైగా మహిళలు ఫ్రీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకున్నారని వివరించారు. ఈ మేరకు ఆర్టీసీకి ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తుందన్నారు. ఫ్రీ బస్సు పథకం ప్రారంభానికి ముందే బస్ స్టేషన్లు, బస్ షెల్టర్లలలో రద్దీకి అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. దీంతో సమస్యలు ఉత్పన్నమవ్వలేదని వివరించారు. స్త్రీ శక్తి పథకం విజయానికి ఆర్టీసీ సిబ్బంది టీమ్ వర్క్ అద్భుతమన్నారు. మన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చిత్తశుద్ధితో పథకంను అమలు చేస్తున్నామని, ఇకపై కూడా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పథకంను నిర్వీఘ్నంగా అమలు చేస్తామన్నారు.

ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ఫ్రీ బస్సు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందించే యోచనలో ఉన్నామని మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రతి బస్సులో సీసీ కెమెరాలు, కండెక్టర్ల కు బాడీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు ఆర్టీసీని బలోపేతం చేస్తాం. పూర్వ వైభవం తీసుకువస్తామన్నారు. ఆర్టీసీ పరిపుష్టికి వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఆర్టీసీ స్థలాలను లీజుకు ఇచ్చి ఆదాయం సమకూర్చుకుంటామని, కార్గో సేవలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ప్రయాణీకుల రద్దీకి అవసరమైన కొత్త బస్సులను కొనుగోలు చేయలేదన్నారు. అయితే కూటమి ప్రభుత్వం త్వరలో 750 ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురానుందని, మరో నాలుగేళ్లలో 2500కు పైగా నూతన బస్సులను కొనుగోలు చేయనున్నామని తెలిపారు. నూతనంగా కొనుగోలు చేసే బస్సులన్నీ ఎలక్ట్రికల్ బస్సులే అని వివరించారు. దాంతో రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా పల్లె వెలుగు బస్సులు సైతం ఏసీ బస్సులే ఉంటాయని చెప్పారు.

కొండ(ఘాట్ రోడ్) ప్రాంతాల్లో సైతం ఫ్రీ బస్సు అమలు చేస్తున్నామని, రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, మరో వారం రోజుల్లో ఆ సమస్యలను పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. తిరుమలకు కూడా ఫ్రీ బస్సు అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు. అలాగే సాంకేతిక సమస్యలను పరిష్కరించి అతి త్వరలోనే తిరుమలకు ఫ్రీ బస్సు పై అనుకూల ప్రకటన వస్తుందన్నారు. ఆర్టీసీకి ప్రయాణీకులు, సిబ్బంది రెండు కళ్లు వంటి వారని, వారి సంక్షేమం, రక్షణ బాధ్యతల్లో వెనక్కు తగ్గేది లేదన్నారు. ముఖ్యంగా మహిళల రక్షణ విషయం రాజీపడే ప్రసక్తే లేదన్నారు. అతి త్వరలో కండెక్టర్ పోస్ట్ లు భర్తీ చేస్తామని హామి ఇచ్చారు. ఉచిత బస్సు పథకం ఆర్టీసీ సంస్థలోని దాదాపు 75 శాతం బస్సుల్లో వర్తిస్తుందన్నారు. మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లు ఉచిత బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆర్థిక వెసులుబాటును పొందాలని పిలుపునిచ్చారు.

Next Story