Venkaiah Naidu : నేను పదవీ విరమణ చేశా.. పెదవి విరమణ చేయలే
రాజకీయాల నుంచి మంచి పేరుతో బయటకు రావడం చాలా అరుదు అని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు
By Medi Samrat
రాజకీయాల నుంచి మంచి పేరుతో బయటకు రావడం చాలా అరుదు అని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. మంగళవారం ఆయన మాజీ రాజ్యసభ సభ్యుడు యలమంచలి శివాజీని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శివాజీ నాకు చాలా సీనియర్ ఇద్దరం కలిసి చాలా ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నాం అని తెలిపారు. నేడు అవకాశం, కుల రాజకీయాలు, కోట్ల రూపాయలతో రాజకీయాలు చేస్తున్నారు.. నేడు ఎన్నికలకోసం డబ్బులు కోట్లాది రూపాయలు ఖర్చు చేయడం దారుణం.. నా రాజకీయ జీవితంలో ఎప్పుడు నా జేబులోని 10 రూపాయలు కూడా ఇప్పటివరకు ఖర్చు చేయలేదన్నారు.
ప్రజలే ఒకప్పుడు డబ్బులు ఇచ్చి రాజకీయాలు చేయిస్తే నేడు నాయకులు డబ్బులు పెట్టి రాజకీయాలు చేస్తున్నారన్నారు. సిద్ధాంత పర రాజకీయాలు చేయడంలో నేటి రాజకీయ నేతలు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. నాడు గ్రామ సమస్యలకు ప్రజలు ప్రాధాన్యత ఇస్తే.. నేడు స్వంత పనులకు రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలలో పెనుమార్పులు రావాలని కోరుకొంటున్నానన్నారు.
ప్రచార సాధనాలు కూడా చైతన్యాన్ని ప్రదర్శించడం లేదని నా సొంత అభిప్రాయం.. సమాచారం ఖచ్చితంగా ఉంటే.. ఆచారం ఖచ్చితత్వం ఉంటుంది.. పత్రికలకు స్వేచ్ఛ ఉండాలని, సత్యానికి దగ్గరగా వుండాలని విశ్వసనీయతతో నడవాలని పిలుపునిచ్చారు. నిష్పక్షపాత రాజకీయాలు, నిష్పక్షపాత ప్రచార సాధనాలు ఉంటేనే న్యాయం గెలుస్తుందని సూచించారు. నేను పదవీ విరమణ చేసాను.. పెదవి విరమణ చేయలేదన్నారు.. జై ఆంధ్ర ఉద్యమ కార్యక్రమంలో పెద్దలతో చాలాకాలం పనిచేశానని తెలిపారు. గత ఎన్నికల సమయంలో బూతుల రాజకీయాలు చేసి మాట్లాడిన ఏ ఒక్కరు కూడా ఎన్నికల్లో గెలవక పోవడం అందరూ చూసారు. భారత దేశంలో యువత విదేశాలలో చదువుకోండి తిరిగి మరలవచ్చి గ్రామాలను ప్రక్షాళన చెయ్యండి.. అభివృద్ధి పథంలో నడవండి అని చూశారు.