అసెంబ్లీలో కచ్చితంగా అడుగుపెడతా.. ఆపేదెవరు?: పవన్
వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి చేరుకున్నారు. అక్కడ భారీ బహిరంగ సభలో
By Srikanth Gundamalla Published on 14 Jun 2023 8:42 PM IST
అసెంబ్లీలో కచ్చితంగా అడుగుపెడతా.. ఆపేదెవరు?: పవన్
వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి చేరుకున్నారు. అక్కడ భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. వారాహి వాహనం పైనే నిల్చుని ప్రసంగం చేశారు. చంద్రబాబుని సీఎం చేసేందుకే వారాహి యాత్ర చేపట్టారన్న విమర్శలను తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. అంతేకాదు తాను సీఎం పదవిని కోరుకోవడం లేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని కత్తిపూడి సభ ద్వారా ఖండించారు. వైసీపీ నాయకులు తనని విడిగా రా..విడిగా రా అని అంటున్నారని.. ఎలా రావాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు పవన్. కానీ.. అసెంబ్లీలో అడుగు పెట్టడం మాత్రం ఖాయమని చెప్పారు. దాని కోసం ఎన్ని వ్యూహాలైనా రచిస్తామన్నారు. అయితే.. ప్రజలు తనకు ముఖ్యమంత్రి పదవిని ఇస్తే సంతోషంగా స్వీకరిస్తానని చెప్పారు పవన్ కల్యాణ్. సీఎం పదవి జనసేనకు రావాలంటే ఏం చేయాలి.. ఎలా ముందుకెళ్లాలనే దానిపై మున్ముందు మాట్లాడుకుందామని అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం తాను రాజకీయాల్లోకి వచ్చానని.. దాని కోసం తన పిల్లల భవిష్యత్ను కూడా వదిలేసి వచ్చినన్నారు. హక్కుల కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో తనపై కక్ష గట్టి ఓడించారని.. కానీ ఈసారి మాత్రం తప్పకుండా అసెంబ్లీలో అడుగు పెట్టే తీరతానని చెప్పారు. భవిష్యత్లో వైసీపీని ఎదుర్కొనే పార్టీ జనసేననే అని పవన్ కల్యాణ్ అన్నారు.
ఏపీ సీఎం సినిమా టికెట్లపైనా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు పవన్ కల్యాణ్. తాను పార్టీ నడపడం కోసమే సినిమాలు చేస్తున్నాని చెప్పారు. అక్రమంగా వచ్చిన ఆస్తులేమీ తనకు లేవన్నారు. రాజకీయంగా అడ్డుకోవాలనే కుట్రలో భాగంగానే తన సినిమాలను అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. పార్టీ స్థాపించి పదేళ్లు నడపడం అంత ఈజీ కాదన్నారు. ప్రజాభిమానం ఉంటేనే పార్టీ ముందుకు సాగుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేనకు ప్రజా మద్దతు భారీగా లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు పవన్ కల్యాణ్.