విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ మరియు సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి స్పష్టం చేశారు. సోమవారం మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో కలిసి ఆయన ప్లాంట్లో పర్యటించి, అక్కడి కార్యకలాపాలను క్షుణ్ణంగా సమీక్షించారు. ఈ సందర్భంగా బ్లాస్ట్ ఫర్నేస్ కార్యకలాపాలు, కోక్ ఉత్పత్తి వంటి కీలక విభాగాలను పరిశీలించిన మంత్రి, విధి నిర్వహణలో ఉద్యోగులు చూపుతున్న అంకితభావాన్ని ప్రత్యేకంగా అభినందించారు.
ముఖ్యంగా బ్లాస్ట్ ఫర్నేస్-3 వద్ద సందర్శకుల పుస్తకంలో తన సందేశాన్ని రాస్తూ.. "ఈ ఏడాది అత్యుత్తమ ఉత్పత్తిని సాధించిన RINL సిబ్బందికి అభినందనలు. ఇదే పట్టుదలతో ప్లాంట్ను నడిపి, దేశంలోనే అత్యుత్తమ ఉక్కు కర్మాగారంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు. అనంతరం ప్లాంట్ CMD మరియు డైరెక్టర్లతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పనితీరు, కార్యాచరణ సామర్థ్యం, ఉప-ఉత్పత్తుల పునరుద్ధరణ మరియు ముడి పదార్థాల నిర్వహణ వంటి అంశాలపై కీలక చర్చలు జరిపారు.