AP : 5 సంస్థలు.. 2 వేల కోట్ల పెట్టుబడులు.. 15 వేల మందికి ఉద్యోగావకాశాలు
ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు అయిదు సంస్థలు ముందుకొచ్చాయని, చేనేత రంగంలో రూ.2 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు
By Medi Samrat
ఆంధ్రప్రదేశ్ లో పరిశ్రమల స్థాపనకు అయిదు సంస్థలు ముందుకొచ్చాయని, చేనేత రంగంలో రూ.2 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. త్వరలో ఆ సంస్థలతో ఎంవోయూలు చేసుకోబోతున్నామని, ఆయా కంపెనీల ఏర్పాటుతో 15 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇంటర్నేషనల్ భారత్ టెక్స్-2025 ఎగ్జిబిషన్ లో మంత్రి సవిత రెండో రోజు సోమవారం కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ లో పాల్గొన్న పలువురు దేశ, విదేశ పెట్టుబడుదారులతో మంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో పరిశ్రమల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలు గురించి, చేనేత రంగంలో అవకాశాలు గురించి వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు ఏపీ అనువైన ప్రాంతమని వెల్లడించారు. చేనేత పరిశ్రమలను సమర్థవంతంగా నిర్వహణకు ప్రభుత్వ తోడ్పాటు అందించడంతో పాటు నాణ్యమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇటీవలే నూతన టెక్స్ టైల్స్ పాలసీ తీసుకొచ్చామన్నారు. పలు సంస్థల ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో జరిగిన చర్చలు ఫలప్రదం కావడంతో, అడ్వాన్స్ టెక్స్ టైల్స్ అసోసియేషన్, ఐటీఎంఎఫ్, మాస్కో ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ సహా మరో రెండు సంస్థల ప్రతినిధులు రాష్ట్రంలో పెట్టుడులు పెట్టడానికి సుముఖం వ్యక్తం చేశారు. రూ.2 వేల కోట్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ఈ సంస్థలు ప్రతినిధులు ముందుకొచ్చారు. త్వరలోనే ఈ పెట్టుబడులుపై ఏపీ ప్రభుత్వంతో ఎంవోయూలు చేసుకోడానికి రాష్ట్రానికి రానున్నట్లు ఆ సంస్థల ప్రతినిధులు మంత్రి సవితకు తెలిపారు. వీరే కాకుండా దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలతో మంత్రి సవిత నేతృత్వంలో ఏపీ బృందం చర్చలు జరిపింది. ఏపీలో రూ.400 కోట్ల మేర అప్ సైక్లింగ్ కు అవకాశాలున్నాయన్నారు. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని పెట్టుబడుదారులకు మంత్రి సవిత సూచించారు. త్వరలో మరిన్ని ఎంవోయూ కుదుర్చుకోనున్నామని మంత్రి వెల్లడించారు. కర్నాటకకు చెందిన ప్రతినిధులు ఎమ్మిగనూరు టెక్స్ టైల్స్ పార్క్ లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపినట్లు మంత్రి సవిత వెల్లడించారు. రష్యాలో టెక్స్ టైల్స్ వేర్ హౌస్ ఏర్పాటుకు ఏపీకి చెందిన గుంటూరు టెక్స్ టైల్స్ పార్క్ అంగీకారం తెలిపిందని మంత్రి సవిత వెల్లడించారు.
చంద్రబాబు బ్రాండ్ తో పెట్టుబడుల వెల్లువ
అనంతరం తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. న్యూఢిల్లీలో ఈ నెల 14వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరిగిన భారత్ టెక్స్-2025 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ విజయవంతమైందన్నారు. 126 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్న ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొన్నారన్నారు. భారత్ టెక్స్ వల్ల చేనేత రంగంలో పెట్టుబడులకు, చేనేత వస్త్రాల మార్కెటింగ్ కొత్త అవకాశాలు లభించాయన్నారు. ఖాదీ ఈజ్ ఏ నేషన్...ఖాదీ ఈజ్ బీ కమింగ్ ఫ్యాషన్ అంటూ ప్రధాని నరేంద్రమోడి చేసిన వ్యాఖ్యలు ఎంతో స్ఫూర్తినిచ్చాయన్నారు. దేశంలో వ్యవసాయం తరవాత అత్యధికంగా ఆధారపడిన రంగం చేనేత రంగమేనన్నారు. ఏపీలో చేనేత రంగంపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. ముఖ్యంగా మహిళలు అత్యధిక శాతం చేనేత ఉత్పత్తుల్లో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే సీఎం చంద్రబాబునాయుడు చేనేత పరిశ్రమ అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారన్నారు. 2014-19 మధ్య చేనేత పరిశ్రమకు, నేతన్నలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నారన్నారు. దీంతో అయిదేళ్లు చేనేతకు స్వర్ణయుగంగా మారిందన్నారు. తరవాత వచ్చిన జగన్ ప్రభుత్వం చేనేతపై చిన్నచూపు చూడడంతో, నేతన్నలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి సీఎం చంద్రబాబు అధికారంలోకి రావడంతో, చేనేత పరిశ్రమకు మంచిరోజులు ప్రారంభమయ్యాయన్నారు. చంద్రబాబే ఏపీకి బ్రాండ్ అంబాసిడర్ అని, ఆయన పాలనాదక్షతపై నమ్మకంతో ఎందరో పెట్టుబడుదారులు ఏపీలో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారన్నారు. చేనేతతో సహా మరెన్నో రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ఏపీకి పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారన్నారు.
త్వరలో ఏపీలో పెట్టుబడుదారులతో సమావేశం
భారత్ టెక్స్ అందించిన స్ఫూర్తితో త్వరలో ఆంధ్రప్రదేశ్ లోనూ చేనేత పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేలా సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమ అభివృద్ధికి సీఎం చంద్రబాబునాయుడు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టేవారికి అనువైన వాతారణం కల్పించారన్నారు. సుస్థిరమైన పాలనతో పాటు రాయితీలు, సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఇప్పటికే ఏపీలో పలు దిగ్గజ కంపెనీలు పెట్టాయన్నారు. చేనేత రంగంలోనూ పెట్టుబడులు పెట్టేలా సదస్సు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు.
35 హ్యాండ్ క్రాప్ట్స్ కు కేంద్రం గుర్తింపు
వన్ డిస్ట్రిక్-వన్ ప్రొడక్ట్ కింద రాష్ట్రంలో 35 హ్యాండ్స్ క్రాఫ్ట్స్ కు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు లభించిందని మంత్రి సవిత వెల్లడించారు. రాష్ట్రంలో ఆయా ప్రాంతాల జీవన విధానాలకనుగుణంగా హస్తకళలు అభివృద్ధి చెందాయన్నారు. ఏటికొప్పాక, ఆదివాసీ సవర చిత్రాలు వంటి హస్త కళలు ఎంతో ప్రాచుర్యం పొందాయన్నారు. ఇలా 35 హస్త కళలకు వన్ డిస్ట్రిక్-వన్ ప్రొడక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ హస్త కళలకు ప్రోత్సాహం అందించడంతో పాటు ఉత్పత్తులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాయన్నారు. దీనిద్వారా హస్త కళాకారులు గౌరవ ప్రదమైన జీవనం సాగించేలా ఆర్థిక భరోసా లభించే అవకాశముందన్నారు.
రాష్ట్రానికి చేయూనితనివ్వండి
అంతకుముందు కేంద్ర చేనేత, జౌళి శాఖ కార్యదర్శి బీనాను మంత్రి సవిత కలిసి పలు సమస్యల పరిష్కారానికి వినతి పత్రమందించారు. రాష్ట్రంలో చేనేత పరిశ్రమకు, నేతన్నలకు అండగా నిలవాలని కోరారు. సర్వశిక్ష అభియాన్ లో చేనేత దుస్తులు వాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర కార్యదర్శి బీనా దృష్టి తీసుకెళ్లారు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు.
పలు స్టాళ్ల సందర్శన
భారత్ టెక్స్ సందర్భంగా వివిధ రాష్ట్రాలు, విదేశాలకు చెందిన స్టాళ్లను మంత్రి సవిత సందర్శించారు. ఆయా రాష్ట్రాలు, దేశాల సంప్రదాయలకు అనుగుణంగా తయారైన దుస్తులను పరిశీలించారు. వాటి నాణ్యత, తయారీ గురించి నిర్వాహాకులను అడిగి తెలుసుకున్నారు. ఏపీ భవన్ లో నిర్వహిస్తున్న చేనేత ఎగ్జిబిషన్ ను మంత్రి సందర్శించారు. అమ్మకాలు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ఏపీ చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, ఆప్కో ఎండీ పావనమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.