తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా డిసెంబర్ 30వ తేదీ నుంచి స్వామివారి వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పేర్కొంది. పది రోజుల పాటు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులు స్వామి వారిని దర్శించుకోవచ్చని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులలో సామాన్యులకు ప్రాధాన్యం కల్పిస్తామని టీటీడీ ఈవో పేర్కొన్నారు.
వైకుంఠ ద్వార దర్శన సమయం మొత్తం 182 గంటలు కాగా ఇందులో 164 గంటలు సాధారణ భక్తులకే కేటాయిస్తామని ఆయన చెప్పారు. ఈ నిర్ణయంతో సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకునే వెసులుబాటు కలుగుతుందని టీటీడీ పాలకమండలి పేర్కొంది.