తలనీలాల స్మగ్లింగ్ గురించి తప్పుడు కథనాలపై టీటీడీ ఆగ్రహం.. కేసులు కూడా..!

TTD Serious. తలనీలాల స్మగ్లింగ్ ఫై ప్రతిష్ట దెబ్బతీసే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు.

By Medi Samrat  Published on  31 March 2021 7:52 AM GMT
hair smuggling

మయన్మార్‌తో మిజోరంకు 510 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఇక్కడి నుంచి పలురకాల వస్తువుల స్మగ్లింగ్‌ గుట్టుచప్పుడు కాకుండా జరిగిపోతూ ఉంటుంది. ఫిబ్రవరి 7న కస్టమ్స్‌ విభాగంతో కలిసి అసోం రైఫిల్స్‌ సెర్చ్‌షిప్‌ బెటాలియన్‌ జవాన్లు ఉమ్మడి ఆపరేషన్‌ చేపట్టగా. మయన్మార్‌ సరిహద్దుకు 7 కిలోమీటర్ల దూరంలో రెండు ట్రక్కులను అడ్డుకున్నారు. వాటిలో 120 బస్తాల తల వెంట్రుకలు బయటపడ్డాయి. డ్రైవర్లను విచారించగా వాటిని తిరుపతి నుంచి తరలిస్తున్నట్లు తేలింది. పట్టుబడిన వెంట్రుకల విలువ రూ.1.80 కోట్లుగా కస్టమ్స్‌ అధికారులు నిర్ధారించారు. తిరుపతి తరహాలోనే దేశవ్యాప్తంగా పలు పుణ్యక్షేత్రాల నుంచి వెంట్రుకలు ఇలా అక్రమంగా మయన్మార్‌కు తరలిస్తున్నట్లు తెలిసింది. మిజోరంలో పట్టుబడిన తల వెంట్రుకలతో తమకెలాంటి సంబంధం లేదని టీటీడీ పేర్కొంది. దీనిపై మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. టీటీడీ వద్ద ఉన్న తలనీలాలను ఈ-ప్లాట్‌ఫాం ద్వారా అంతర్జాతీయ టెండర్లు పిలిచి ఎక్కువ మొత్తం కోట్‌ చేసిన వారికి విక్రయిస్తామని, సంబంధిత బిడ్డర్‌ నుంచి జీఎ్‌సటీ కూడా కట్టించుకుని తలనీలాలను అప్పగిస్తామని, బిడ్డర్‌కు అంతర్జాతీయ ఎగుమతి అనుమతులున్నాయా? లేక దేశంలోనే ఏ ప్రాంతంలోనైనా విక్రయిస్తారా అనేది తమకు సంబంధించిన విషయం కాదని టీటీడీ స్పష్టం చేసింది.

తలనీలాల అంశంపై టీటీడీపై తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు ఈవో ధర్మారెడ్డి హెచ్చరించారు. హెచ్చరించినట్లుగానే పలు ఛానల్స్ పైన కేసులు పెట్టింది టీటీడీ. తలనీలాలను టీటీడీ చైనాకు స్మగ్లింగ్ చేసే ప్రయత్నం చేసిందని ఫేస్ బుక్, మీడియాలో దుష్ప్రచారం చేశారని.. టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీసే ఉద్దేశంతో తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. వీరిపై మంగళవారం రాత్రి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీడీపీకి చెందిన సోష‌ల్ మీడియా పేజీలు రామ రాజ్యం మళ్లీ మొదలైంది, టీడీపీ పొలిటికల్ వింగ్ , గంగా ప్రకాష్, ప్రియాంక రెడ్డి స్వచ్ఛ, ఓ న్యూస్ ఛానల్, పేపర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వీరంతా ఫేస్ బుక్‌లో పోస్టులు పెట్టడం, షేర్ చేయడం, దుష్ప్రచారం చేయడం వంటి చర్యలకు పాల్పడినట్లు విజిలెన్స్ అధికారులు ఆధారాలు సమర్పించారు.


Next Story