శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది.
By - Knakam Karthik |
శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పిన టీటీడీ
తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. భక్తుల సౌక ర్యార్థం వచ్చే ఏడాది జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల కోటా టికెట్లు, అంగ ప్రదక్షిణ టోకెన్లను రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబర్ 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందినవారు అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా కూడా 23న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అందుబాటులో ఉండనుంది.
శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 24న ఉదయం 11 గంటలకు, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్ల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. శ్రీవారి ఆర్జిత, దర్శన టికెట్లను https://ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవచ్చని టీటీడీ పేర్కొంది.