విశాఖపట్నం నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రుషికొండ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. బీచ్ రోడ్డులో ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో మంటలు అంటుకున్నాయని, చూస్తుండగానే అవి బస్సు మొత్తం వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ హఠాత్పరిణామంతో బీచ్ రోడ్డులో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.
ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేయడంతో, ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడటంతో పెను ముప్పు తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మరియు పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో జరిగిన ఆస్తి నష్టం ఎంత అనే దానిపై అధికారులు అంచనా వేస్తున్నారు. బస్సులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కాకుండా ఇతర సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.