విషాదం.. తరగతి గదిలో తేలు కుట్టి విద్యార్థి మృతి
అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తేలు కుట్టడంతో విద్యార్థి మృతి చెందాడు.
By అంజి Published on 25 Aug 2023 10:30 AM IST
విషాదం.. తరగతి గదిలో తేలు కుట్టి విద్యార్థి మృతి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. తేలు కుట్టడంతో విద్యార్థి మృతి చెందాడు. కోరుమిల్లి గ్రామానికి చెందిన వై. ప్రసాద్, శ్రీదేవిల చిన్న కుమారుడు 14 ఏళ్ల అభిలాష్ 14.. వాకతిప్ప జడ్పీహెచ్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే గురువారం తరగతి గదిలో చిక్కిల కపర్లు ఎక్కువగా ఉండడంతో మరో విద్యార్థితో కలిసి శుభ్రం చేయుచుండగా అభిలాష్ ఎడమ చేతి వేలును తేలు కుట్టింది. ఉపాధ్యాయులు వేను వెంటనే స్థానిక పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. మెరుగైన వైద్యం నిమిత్తం కాకినాడ జిజిహెచ్ కు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఊపిరితిత్తులలో విషం చేరడంతో, రక్తపు వంతులు అయ్యి బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలియజేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు అంగర ఎస్సై జి చంటి తెలియజేశారు. మృతుడి తండ్రి వలస కూలీగా తెలంగాణలోని వరంగల్లో పనిచేస్తున్నాడు. తల్లి ఉపాధి నిమిత్తం కువైట్లో ఉంటోంది. అయితే తాతయ్య వద్ద ఉంటూ ఇలా చదువుతూ ఉంటుండగా ఇలా జరగడం స్థానికుల్లో విషాదం నింపింది. ఇదిలా ఉంటే.. ఇటీవల మైలవరం మండలంలోని వేపరాల జెడ్పీహెచ్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఎ.మహేష్ అనే విద్యార్థి తరగతి గదిలో తేలు కాటుకు గురయ్యాడు. వేపరాల గ్రామానికి చెందిన ఎ.మహేష్ రోజు లాగానే పాఠశాలకు వచ్చాడు. తరగతి గదిలో ఉండగా మండరగబ్బ (తేలు) విద్యార్థి ఉన్న చోటుకు వచ్చి కాటు వేసింది. దీంతో నొప్పి రావడంతో విద్యార్థి గమనించాడు. వెంటనే ఉపాధ్యాయులు గమనించి తేలును చంపేశారు.