శ్రీవారి భక్తులకు అలర్ట్, ఆ తేదీల్లో ఆర్జిత సేవలు రద్దు..కారణమిదే!
శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది.
By - Knakam Karthik |
శ్రీవారి భక్తులకు అలర్ట్, ఆ తేదీల్లో ఆర్జిత సేవలు రద్దు..కారణమిదే!
తిరుమల: శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక సూచన చేసింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇక శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా తొలిరోజు ఫిబ్రవరి 26న శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో మూడు చుట్లు తిరిగి భక్తులకు కనువిందు చేస్తారు. రెండవ రోజు ఫిబ్రవరి 27న రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామి తెప్పలపై మూడుసార్లు విహరిస్తారు. మూడవరోజు ఫిబ్రవరి 28న శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు మూడుసార్లు పుష్కరిణిలో చుట్టి భక్తులను అనుగ్రహిస్తారు.
ఇదే విధంగా శ్రీమలయప్పస్వామివారు నాలుగో రోజు మార్చి 01న ఐదుసార్లు, చివరి రోజు మార్చి 02వ తేదీ ఏడుసార్లు తెప్పపై పుష్కరిణిలో విహరించి భక్తులను కటాక్షిస్తారు. తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 26,27 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, ఫిబ్రవరి 28న, మార్చి 01, 02వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.