గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో మరణాలకు గల కారణాలపై మంత్రివర్గ సమావేశానికి ముందు మంత్రి సత్యకుమార్ యాదవ్ సచివాలయంలో సమీక్షించారు. సమీక్షా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్, డీఎంఈ డాక్టర్ రఘునందన్ పాల్గొన్నారు. తురకపాలెంలో మరణాలు ఎక్కువగా ఉన్నా.. కారణాల నిర్ధారణలో జరుగుతున్న జాప్యంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులను ప్రశ్నించారు.
జులై నుంచి సెప్టెంబరు 3వ తేదీ మధ్య 23 మరణాలు జరిగినప్పుడు.. అప్రమత్తంగా కాకుంటే ఎలా అని జిల్లా అధికారుల తీరుపై మంత్రి అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న ఆశా, ఎ.ఎన్.ఎం.లు, మెడికల్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గుంటూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల్యాబ్ నుంచి వచ్చే రక్త నమూనాల పరీక్షల ఫలితాలకనుగుణంగా అప్రమత్తమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామంలోని వారికి కిడ్నీ, హెచ్బీఎ1సీ (షుగర్), బీపీ టెస్టులు ఏమేరకు జరుగుతున్నాయని ఆరా తీశారు. తురకపాలెంలో క్షేత్రసాయి పర్యటన ద్వారా గుర్తించిన అంశాలను డీఎంఈ డాక్టర్ జి.రఘునందన్ మంత్రికి వివరించారు.