Andhrapradesh: చిన్న ఆలయాలకు సాయం రూ.10 వేలకు పెంపు
అమరావతి: సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక్కో హామీని అమలు చేస్తూ వస్తోంది.
By అంజి Published on 4 Oct 2024 8:24 AM IST
Andhrapradesh: చిన్న ఆలయాలకు సాయం రూ.10 వేలకు పెంపు
అమరావతి: సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఒక్కో హామీని అమలు చేస్తూ వస్తోంది. తాజాగా ఆదాయం లేని చిన్న ఆలయాల్లో ధూప, దీప, నైవేద్యాలకు ప్రతి నెలా అందించే సాయాన్ని రూ.5,000 నుంచి రూ.10,000కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో రూ.7 వేలు అర్చకుడి భృతిగా, రూ.3 వేలు పూజలకు వినియోగించాలని పేర్కొంది. ఈ మొత్తాన్ని అర్ఛకుడి ఖాతాలోనే జమ చేస్తామని చెప్పింది. దీని వల్ల రాష్ట్రంలోని 5,400 ఆలయాలకు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వంపై అదనంగా ఏటా రూ.32.40 కోట్ల భారం పడనుంది.
ఆదాయం లేని చిన్న ఆలయాల్లో నిత్యం దీపం వెలిగించి, నైవేద్యం పెట్టేందుకు ధూప, దీప నైవేద్యం పథకం అమలు చేస్తోంది ప్రభుత్వం. గతంలో నెలకు రూ.2500 చొప్పున అందించగా 2015లో టీడీపీ ప్రభుత్వం దీనిని రూ.5 వేలకు పెంచింది. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో తాజాగా ఆ సాయాన్ని రూ.10 వేలకు పెంచారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ సత్యనారాయణ ఉత్తర్వుల జారీ చేశారు. అర్ఛకుడి ఖాతాలో ప్రతి నెలా ఈ మొత్తాన్ని జమ చేస్తారు. ఈ పెంపుతో ప్రభుత్వంపై పడే భారాన్ని సర్వ శ్రేయో నిధి నుంచి వినియోగించాలని దేవాదాయ శాఖ తన ఉత్తర్వులో పేర్కొంది.