అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ యువకుడి జీవితం విషాదాంతమైంది. బాపట్ల జిల్లా మార్టూరు గ్రామానికి చెందిన పాటిబండ్ల లోకేశ్ (25) బోస్టన్ నగరంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఆగస్టు 3వ తేదీన లోకేశ్ తన స్నేహితులతో కలిసి సరదాగా స్విమ్మింగ్ పూల్ కు వెళ్లాడు. ఈ క్రమంలో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అతడి స్నేహితులు మార్టూరులోని కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా తెలియజేశారు.
మార్టూరుకు చెందిన గ్రానైట్ వ్యాపారి పాటిబండ్ల వేణుబాబు, శాంతి దంపతుల కుమారుడు లోకేశ్. ఉన్నత చదువుల కోసం మూడేళ్ల క్రితం అమెరికా వెళ్లిన అతడు, అక్కడ ఎంఎస్ పూర్తి చేశాడు. చదువు పూర్తయిన తర్వాత సుమారు ఎనిమిది నెలల క్రితమే బోస్టన్లో ఉద్యోగంలో చేరాడు. లోకేశ్ మృతదేహాన్ని వీలైనంత త్వరగా మార్టూరుకు తరలించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.