సీఎం చంద్రబాబును క‌లిసిన 'వ‌ర‌ల్డ్ క‌ప్' స్టార్‌..!

తెలుగు క్రీడాకారిణి శ్రీచరణి, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి శుక్రవారం సీఎం చంద్రబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు

By -  Knakam Karthik
Published on : 7 Nov 2025 1:30 PM IST

Andrapradesh, CM Chandrababu, Sree Charani, Mithali Raj, Indian Womens Cricket Team, Womens World Cup, Nara Lokesh

సీఎం చంద్రబాబుతో తెలుగు క్రికెటర్ శ్రీచరణి, మిథాలీరాజ్ సమావేశం

భారత మహిళల క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలవడంలో భాగమైన తెలుగు క్రీడాకారిణి శ్రీచరణి, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి శుక్రవారం సీఎం చంద్రబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రపంచకప్ సాధించినందుకు శ్రీచరణిని ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేశ్‌ ప్రత్యేకంగా అభినందించారు.

ప్రపంచ వేదికపై భారత మహిళల సత్తాను చాటి చెప్పారని, ఎంతో మంది యువ క్రీడాకారిణులకు శ్రీచరణి ఆదర్శంగా నిలిచారని చంద్రబాబు ప్రశంసించారు. ప్రపంచకప్ గెలుచుకున్న ఆనందకరమైన క్షణాలను, టోర్నీలోని అనుభవాలను శ్రీచరణి.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌తో పంచుకున్నారు.

అంతకుముందు విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న శ్రీచరణికి ఘన స్వాగతం లభించింది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీశ్‌, రాష్ట్ర మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు తదితరులు ఆమెకు సాదర స్వాగతం పలికారు.

అనంతరం మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రముఖులు శ్రీచరణి, మిథాలీ రాజ్‌లను వెంటపెట్టుకుని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి తీసుకువచ్చారు. అక్కడ వీరికి మంత్రి లోకేశ్‌ స్వాగతం పలికి సమావేశానికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, క్రీడా శాఖ అధికారులు పాల్గొన్నారు.

Next Story