Andhrapradesh: రాష్ట్రంలో కొత్త పథకం.. మొదలైన సర్వే
రాష్ట్రంలో పీ-4 పేరుతో కొత్త పథకాన్ని ఉగాది నుంచి ప్రభుత్వం అమలు చేయనుంది. 16 జిల్లాల్లో నిన్నటి నుంచి సర్వే మొదలైంది.
By అంజి
Andhrapradesh: రాష్ట్రంలో కొత్త పథకం.. మొదలైన సర్వే
అమరావతి: రాష్ట్రంలో పీ-4 పేరుతో కొత్త పథకాన్ని ఉగాది నుంచి ప్రభుత్వం అమలు చేయనుంది. 16 జిల్లాల్లో నిన్నటి నుంచి సర్వే మొదలైంది. మొత్తం పేదల్లో అట్టడుగున ఉండే 20 శాతం పేదలను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేస్తోంది. 27 ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తోంది. ఇంటి యజమాని ఆధార్, ఫోన్ నంబర్, టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీ, ల్యాప్టాప్, కంప్యూటర్ ఉందా? కరెంట్ బిల్లు ఎంత కడుతున్నారు? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నెల 18 వరకు సర్వే పూర్తి చేయాలి. 21 నుంచి 23 వరకు గ్రామాల వారీగా సభలు నిర్వహించి వివరాలు వెల్లడిస్తారు. ఆ తర్వాత ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తారు. ఉగాది రోజు పీ-4 కార్యక్రమ వివరాలను ప్రకటిస్తారు.
ఉగాది నుంచి పీ-4 విధానం అమలు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. అట్టడుగున ఉన్న పేదల సాధికారత, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దీనిని చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అదనంగా పీ-4లో ఉన్న వారికి చేయూత ఇస్తామని చెప్పారు. ముందుగా నాలుగు గ్రామాల్లో పీ-4 విధానం పైలట్ ప్రాజెక్టును అమలు చేసి 5,869 కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ పీ - 4 కార్యక్రమానికి 2 ఎకరాల మాగాణి / ఐదు ఎకరాల మెట్ట భూమి, ప్రభుత్వ ఉద్యోగులు, టాక్స్ పేయర్స్, ఫోర్ వీలర్స్ ఉన్న వారు, 200 యూనిట్ల కన్నా ఎక్కువ విద్యుత్ వాడే వారు అర్హులు కారు.