ఆంధ్రప్రదేశ్ లిక్కర్ పాలసీ కుంభకోణంలో కీలక నిందితుడైన ముప్పిడి అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు శుక్రవారం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. 2019 నుంచి 2024 మధ్య కాలంలో జరిగిన భారీ అవకతవకలు, వ్యవస్థీకృత లంచాల నెట్వర్క్కు సంబంధించి అవినాష్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి మరియు జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఇప్పటికే 11 మంది నిందితులకు బెయిల్ మంజూరైన విషయాన్ని కోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది.
ఈ కేసులో అరెస్టు భయంతో గతంలో శ్రీలంకకు పారిపోయిన అవినాష్ రెడ్డి, ఆ తర్వాత తిరిగి వచ్చి అధికారుల ఎదుట లొంగిపోయి విచారణకు సహకరించారని ధర్మాసనం పేర్కొంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ బెయిల్ పిటిషన్ను గట్టిగా వ్యతిరేకించారు. సుమారు రూ. 730 కోట్ల మేర జరిగిన ఈ కుంభకోణం తీవ్రతను వివరిస్తూ.. నిందితుడు ఏడాది పాటు అజ్ఞాతంలో ఉండి దేశం విడిచి పారిపోయారని, షెల్ కంపెనీల ద్వారా నిధులను మళ్లించడంలో ఆయనది కీలక పాత్ర అని కోర్టుకు వివరించారు.
నిందితుడి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. అవినాష్ రెడ్డి స్వచ్ఛందంగా భారతదేశానికి తిరిగి వచ్చి 2026 ఫిబ్రవరి 26న అధికారుల ఎదుట లొంగిపోయారని తెలిపారు. ఉభయ పక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఈ కేసులోని 'విలక్షణమైన పరిస్థితుల' దృష్ట్యా మాత్రమే బెయిల్ మంజూరు చేస్తున్నామని, దీనిని ఇతర కేసులకు ఉదాహరణగా తీసుకోకూడదని స్పష్టం చేసింది. విచారణ కోర్టు విధించే నిబంధనలకు లోబడి రెడ్డిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.