ఆపడానికి, పీకడానికి అమరావతి ఎవరి ఇంట్లో పెరటి మొక్కకాదు : నారా లోకేష్
రాష్ట్రంలో 2019-24 నడుమ విధ్వంస పాలన నడిచింది, చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపాలని చూశారు,
By Medi Samrat
రాష్ట్రంలో 2019-24 నడుమ విధ్వంస పాలన నడిచింది, చంద్రబాబుపై వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపాలని చూశారు, ఒక్క ఇటుక పెట్టకుండా మూడు రాజధానులు అంటూ ఐదేళ్లు కాలం గడిపేసారని రాష్ట్ర విద్య, ఐటి,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. అమరావతి పనుల పునః ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లోకేష్ మాట్లాడుతూ.. 8 ఏళ్ల పిల్లాడి దగ్గర నుండి 80 ఏళ్ళ వృద్ధుల వరకూ జై అమరావతి అంటూ జెండా పట్టారు. జై అమరావతి అన్నందుకు అనాడు రైతులకు సంకెళ్లు వేసారు, అమరావతి ఉద్యమంలో పాల్గొన్నందుకు మహిళా రైతుల్ని పోలీసుల బూటు కాలితో తన్నించారు. 1631 రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది. 270 మంది రైతులు చనిపోయారు. 3 వేల మంది పై అక్రమ కేసులు పెట్టారు. ఎన్ని కుట్రలు చేసినా జై అమరావతి నినాదాన్ని మాత్రం ఆపలేకపోయారు. ఆపడానికి, పీకడానికి అమరావతి ఎవరి ఇంట్లో పెంచుకున్న పెరటి మొక్క కాదు... జనం గుండెల్లో దాచుకున్న ప్రజా రాజధాని. అమరావతికి శంకుస్థాపన చేసింది మన ప్రధాని నమో. ఆయన శంకుస్థాపన చేసిన దానిని ఆపే దమ్ము ఎవడికీ లేదు. 1631 రోజులు పోరాడి అమరావతిని సాధించుకున్న రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.
వరల్డ్ మ్యాప్ లో పాకిస్థాన్ మిస్సింగ్ ఖాయం!
పాకిస్థాన్ గీత దాటింది… అమాయకుల్ని చంపి చాలా పెద్ద తప్పు చేసింది. ఒక్క పాకిస్థాన్ కాదు, వంద పాకిస్థాన్లు వచ్చినా భారతదేశం నేల పై మొలిచిన గడ్డి కూడా పీకలేరు. వంద పాకిస్తాన్లకు సమాధానం చెప్పే ఒక మిసైల్ మన దగ్గర ఉంది. ఆ మిసైల్ పేరు నరేంద్ర మోదీ. సింహం ముందు ఆటలు ఆడకూడదు. మన సింహం నమో కొట్టే దెబ్బకు వరల్డ్ మ్యాప్ లో పాకిస్థాన్ మిస్సింగ్ అని రావడం ఖాయం. పాకిస్థాన్ ఆర్మీ లో పనిచేసే వారు సెలవు పెట్టి పారిపోతున్నారు, కొంత మంది రాజీనామా చేస్తున్నారు...దటీజ్ నరేంద్ర మోదీ. నమో కొట్టే దెబ్బకి పాకిస్థాన్ దిమ్మతిరగడం ఖాయం. పాకిస్థాన్కు ధీటుగా సమాధానం ఇవ్వడానికి దేశం మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అండగా నిలుస్తుంది.పహాల్గామ్ ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తున్నాను. ఉగ్రదాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు దేశం అండగా ఉంటుంది.
కులగణన సంచలనాత్మక నిర్ణయం
కేంద్రం కుల గణన చేయాలని తీసుకున్ నిర్ణయం ఒక సంచలనం. ఇతరులు దశాబ్దాలుగా సంకోచించిన ఒక కీలక అంశంపై మోడీ జీ ధైర్యంగా నిర్ణయం తీసుకుని చరిత్రను తిరిగి రాశారు. అణగారిన వర్గాలకు సాధికారత కల్పించాలనే నిబద్ధతకు లోబడి మోడీ జీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. వెనుకబడిన వర్గాల సామాజిక న్యాయం కోసం దశాబ్ధాలుగా చేస్తున్న పోరాటాలకు ఈ నిర్ణయం పరిష్కారం చూపుతుంది.
జెట్ స్పీడ్ తో అభివృద్ధి వికేంద్రీకరణ
ప్రధాని నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఇక మనకు తిరుగులేదు, అమరావతి అన్స్టాపబుల్. అభివృద్ధి వికేంద్రీకరణ జెట్ స్పీడ్ తో జరగబోతుంది. అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ప్రకాశం జిల్లా లో సిబిజి ప్లాంట్స్ ...ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి అన్ని రకాలుగా ప్రధాని నరేంద్ర మోదీ సహకారం అందిస్తున్నారు. మనం గతాన్ని ఒకసారి గుర్తుచేసుకోవాలి. 2014లో కట్టుబట్టలతో మనల్ని బయటకు గెంటేసారు. ఎక్కడి నుండి పరిపాలన ప్రారంభించాలో తెలియని పరిస్థితి. చంద్రబాబు గారికి సంక్షోభాలు కొత్త కాదు. ఒక పక్క సంక్షేమం - మరో పక్క అభివృద్ధి చేసి చూపించారు. అందరూ ఆమోదం తెలిపిన తరువాతే అమరావతిని రాజధానిగా ప్రకటించారు. రైతుల త్యాగంతో అమరావతి ఏర్పడింది. ఒకే రాజధాని - అభివృద్ధి వికేంద్రీకరణ ఎజెండాతో పనిచేసాం. రాయలసీమను ఎలక్ట్రానిక్స్, ఆటోమైబైల్ హబ్ గా తయారు చేసాం, గోదావరి జిల్లాల్లో ఆక్వా ను ప్రోత్సహించాం, ఉత్తరాంధ్రలో ఫార్మా, ఐటీ కంపెనీలను తీసుకొచ్చాం.
ఇప్పుడు ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీకి ఆంధ్రప్రదేశ్ అన్నా, అమరావతి అన్నా ఎంతో ప్రేమ. ఇప్పుడు ఆయన ఢిల్లీ లో ఎంత బిజీగా ఉన్నారో మన అందరికీ తెలుసు. అయినా ఈ కార్యక్రమానికి వచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రజలు ఎన్డీయేకి 94 శాతం సీట్లు ఇచ్చారు . మన ప్రధాని నరేంద్ర మోదీజీ ఆంధ్రప్రదేశ్ కోరిన ప్రతి కోరికను తీరుస్తున్నారు. గతంలో విశాఖపట్నం వచ్చి రైల్వే జోన్, ఎన్టీపీసి గ్రీన్, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కు శంకుస్థాపన చేసారు. విశాఖ ఉక్కును కాపాడారు. ఇప్పుడు అమరావతి అభివృద్ధికి నిధులు కేటాయించడమే కాకుండా పనులు తిరిగి ప్రారంభిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. రెండూ పవర్ ఫుల్ ఇంజిన్లు. ఒక పక్క పవర్ ఫుల్ ఇంజిన్ నమో, మరో పక్క మన చంద్రబాబు గారు. అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండి. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు మన చంద్రబాబు, పవనన్న. ఇక మనకు తిరుగు లేదు.
20లక్షల ఉద్యోగాల కల్పనదిశగా అడుగులు
ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల్లోనే 8 లక్షల కోట్ల పెట్టుబడులు వాటి ద్వారా 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాం. 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాం. 1,85,000 కోట్లు పెట్టుబడి, 57 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఎన్టిపిసి గ్రీన్ ఎనర్జీ విశాఖపట్నం రాబోతుంది. 1,36,000 కోట్లు పెట్టుబడి, 55 వేల మందికి ఉద్యోగాలు కల్పించే ఆర్సెల్లార్ మిట్టల్ అనకాపల్లి కి రాబోతుంది. 97,000 కోట్లు పెట్టుబడి, 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించే బిపిసిఎల్ రామాయపట్నం కి రాబోతుంది. తిరుపతి జిల్లా కు ఎల్జీ ఎలక్ట్రానిక్స్, కర్నూలు, కడప, అనంతపురం కు రెన్యూవబుల్ ఎనర్జీ, ప్రకాశం కు రిలయన్స్ సిబిజి. ఉత్తరాంధ్ర కు ఫార్మా, ఐటి ఇలా అన్ని జిల్లాలను అభివృద్ధి చేయబోతున్నాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.