ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా, సామాజిక భద్రతా పించన్ల కింద వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే స్పౌజ్ కేటగిరీ కింద రాష్ట్రవ్యాప్తంగా 71,380 మందికి కొత్తగా పెన్షన్లు జారీకి సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) ఆదేశాలు జారీ చేసింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద 2025 మే నెల నుంచి స్పౌజ్ కేటగిరీ పెన్షన్ల జారీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో నెలకు రూ.4 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 71,380 మందికి కొత్తగా పెన్షన్ల జారీకి సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 12 తేదీన ఈ పెన్షన్లను లబ్దిదారులకు అందించనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
తాజా నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై నెలకు 35 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడనుంది. ప్రస్తుతం వృద్ధాప్య, దివ్యాంగ సహా వివిధ కేటగిరీకల కింద ప్రభుత్వం 63 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు పెన్షన్లు ఇస్తోంది. ఎన్టీఆర్ భరోసా కింద పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి పింఛన్ అందించేలా ఈ స్పౌజ్ కేటగిరీని ప్రవేశపెట్టి గతేడాది నవంబర్ నుంచే అమలు చేస్తున్నారు. అర్హురాలైన మహిళ తన భర్త మరణ ధ్రువీకరణ పత్రం, తన ఆధార్ కార్డు వంటి పత్రాలతో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని సంప్రదించాలి. నెలాఖరులోపు ఈ వివరాలతో సంప్రదిస్తే వారికి మరుసటి నెలలో పింఛన్ సొమ్ము అందిస్తారు.