సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసేవారిపై చర్యలకు అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టం
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించి అభద్రతా భావానికి గురిచేసే వారిపై ఇకపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుందని.. దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురానున్నట్టు రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖామంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు
By Medi Samrat
సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించి అభద్రతా భావానికి గురిచేసే వారిపై ఇకపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోనుందని.. దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురానున్నట్టు రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖామంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పధకాలను చూసి ఓర్వలేక సోషల్ మీడియాలో విషం చిమ్ముతూ వాస్తవాలను అవాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించడమే గాక అభధ్రతా భావానికి గురి చేస్తున్నారని.. ఇకపై అలాంటి దుష్ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని స్పష్టం చేశారు. అంతేగాక ప్రత్యేకంగా ఒక ప్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసి వాస్తవాలేమిటో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం జరుగుతుందని అన్నారు. అమరావతి మునిగిపోయిందని విజయవాడ ప్రకాశం బ్యారేజి గేట్లు పనిచేయడం లేదని పలు అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో ఇష్టారీతిన ప్రసారం చేస్తూ ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేస్తున్నారని ఇకపై అలాంటి తప్పుడు వార్తల ప్రసారాలను సమర్ధవంతంగా తిప్పకొట్టడం తోపాటు అందుకు కారకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్టు మంత్రి అనిత స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలన్నీ విజయవంగా అమలు చేయడంతో ప్రతిపక్షపార్టీ తట్టులేక పోతోందని అందుకే సోషల్ మీడియా వేదికగా దుప్ప్ర్రచారాన్ని చేస్తోందని హోం మంత్రి అనిత విమర్శించారు. ఇది ఆపార్టీకి వారసత్వంగా వచ్చిన సమస్యగా ఉందని ఆమె ఎద్దవా చేశారు. ఒక్క ఆగష్టు నెలలోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ,నేతన్నలకు,నాయి బ్రాహ్మణులకు 200 వరకూ ఉచిత విద్యుత్,స్త్రీశక్తి పధకం కింద మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిచండం జరిగిందని అన్నారు. నాలుగు రోజుల్లో సుమారు 20 లక్షల మందికి పైగా మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణించి సుమారు 20 కోట్ల రూ.ల వరకూ లబ్ది పొందారని తెలిపారు.అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంటే ఎపి బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా ప్రతిపక్ష వైసిపి వారి అనుబంధ మీడియా సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అనిత పేర్కొన్నారు.ఎపి బ్రాండ్ ఇమేజ్ గురించి మాట్లాడాలంటే ముందుగా గుర్తువచ్చేది సియం చంద్రబాబు నాయుడేనని అలాంటి ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడమేమిటన్నారు. అమరావతిపై లేనిపోని రాతలు రాసేవారిపై కేసులు పెడతామని ఆనాడు రఘురామ కృష్ణ రాజుపై కాదు ఈనాడు మీరు పెడుతున్న తప్పుడు పోస్టులపై రాజద్రోహం కేసులు పెట్టాలని అన్నారు.ఇకపై ఇలాంటి తప్పుడు పోస్టులు పెట్టవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సియం స్పష్టం చేశారని మంత్రి అనిత పునరుద్ఘాటించారు. అసాంఘిక శక్తులను ఎలా అరికట్టాలో చంద్రబాబుకు బాగా తెలుసని అలాంటి శక్తులపై ఉక్కుపాదం మోపుతామని శాంతిభద్రతల విషయంలో రాజీలేదు హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.