తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు

ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు

By Medi Samrat  Published on  23 Jan 2024 2:30 PM GMT
తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు

ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. ఇందులో టీడీపీ నుండి గెలిచి వైసీపీలోకి నలుగురు వెళ్లగా, వైసీపీ నుండి విజయం సాధించిన నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి సపోర్ట్‌గా ఉన్నారు. జనసేన నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వైపీసీకి మద్దతుగా ఉన్నారు. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేష్, రాపాక వరప్రసాద్‌ వైసీపీలోకి రాగా, శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం నారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి టీడీపీకి మద్దతుగా ఉన్నారు. పార్టీ ఫిరాయించిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ నోటీసులు జారీ చేశారు. పార్టీ మార్పుపై వారంలోగా సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలను స్పీకర్ ఆదేశించారు. ఎమ్మెల్యేల నుండి సరైన సమాధానం రాకపోతే అనర్హత వేటు వేస్తామని నోటీసుల్లో తెలిపారు.

టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఆమోదించారు. రెండేళ్ల కిందట స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా గంటా తన పదవికి రాజీనామా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణనను వ్యతిరేకిస్తూ 2022 ఫిబ్రవరిలో గంటా శ్రీనివాస్ రావు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను స్పీకర్‌కు అందించారు.

Next Story