విద్యార్థులకు శుభవార్త.. త్వరలోనే 'తల్లికి వందనం': మంత్రి నాదెండ్ల
సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచిత గ్యాస్కు అధిక ప్రాధాన్యత ఇచ్చామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
By అంజి Published on 17 Jan 2025 7:56 AM IST
విద్యార్థులకు శుభవార్త.. త్వరలోనే 'తల్లికి వందనం': మంత్రి నాదెండ్ల
అమరావతి: సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచిత గ్యాస్కు అధిక ప్రాధాన్యత ఇచ్చామని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. త్వరలో 'తల్లికి వందనం' అమలు చేస్తామన్నారు. "రానున్న రోజుల్లో కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నాం, ఉచిత ఇళ్ల స్థలాలు, సొంత ఇల్లు అందించనున్నాం. ఇతర సూపర్ సిక్స్ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేయనున్నాం" అని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఒకే సారి 1000 రూపాయలు పెంచి 4000 రూపాయల పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం తమదని అన్నారు. ఒకటో తేదీ కంటే ముందే పెన్షన్లు అందిస్తున్నామన్నారు. రైతులకు పంట డబ్బు 48 గంటల్లో అకౌంట్లో వేశామని తెలిపారు. దాదాపు 90 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్ దీపం- 2 పథకం ద్వారా అందించామని అన్నారు. గత ప్రభుత్వ సమయంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని మంత్రి నాదెండ్ల ఆరోపించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో జనసైనికుల కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని చెప్పారు. జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ప్రమాదవశాత్తూ మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారన్నారు. ప్రతీ గ్రామంలో రోడ్లు నిర్మాణం జరుగుతున్నాయన్నారు.