అమరావతిలో రూ.100 కోట్లతో ప్రపంచ స్థాయి గ్రంధాలయం
దుబాయ్ లోని ప్రముఖ సంస్థ శోభా రియాల్టి అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంధాలయం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రూ.100 కోట్ల విరాళంతో వరల్డ్ క్లాస్ లైబ్రరీని నిర్మించనుంది.
By - Medi Samrat |
దుబాయ్ లోని ప్రముఖ సంస్థ శోభా రియాల్టి అమరావతిలో ప్రపంచ స్థాయి గ్రంధాలయం ఏర్పాటుకు ముందుకు వచ్చింది. రూ.100 కోట్ల విరాళంతో వరల్డ్ క్లాస్ లైబ్రరీని నిర్మించనుంది. ఏపీలో పెట్టుబడి అవకాశాలు వివరించేందుకు దుబాయ్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబుతో ఆ దేశంలోని శోభా రియాల్టి చైర్మన్ రవి మీనన్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో లైబ్రరీ ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రితో చర్చించారు. శోభా రియాల్టి సంస్థ అమరావతిలో ప్రపంచ స్థాయి స్టేట్ లైబ్రరీ నిర్మించేందుకు ముందుకు రావటంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. గ్రంథాలయం నిర్మాణానికి ఇంత పెద్ద మొత్తంలో విరాళం ప్రకటించటంపై ధన్యవాదాలు తెలియచేశారు. అమరావతిని ప్రపంచంలో అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నామని సీఎం ఆయనకు వివరించారు. రాజధాని నిర్మాణంలో శోభా రియాల్టీ సంస్థ కూడా భాగస్వామి కావాలని ఆహ్వానించారు. ఏపీకి వచ్చి రాజధాని నిర్మాణాన్ని పరిశీలించాలని కోరారు. దేశవ్యాప్తంగా ప్రపంచ స్థాయిలో నగరాలు నిర్మితం అవుతున్నాయని వాటితో సమానంగా మౌలిక సదుపాయాలతో అమరావతిని నిర్మిస్తున్నట్టు సీఎం వివరించారు. గ్రీన్ ఎనర్జీకి రాష్ట్రాన్ని చిరునామాగా చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు శోభా గ్రూప్ ప్రతినిధులకు చంద్రబాబు వివరించారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ, విశాఖలో గూగుల్ డాటా సెంటర్ ఏర్పాటు అవుతోందని చంద్రబాబు చెప్పారు. ఇక తిరుపతి, విశాఖ వంటి నగరాల్లో రానున్న రోజుల్లో అనేక మార్పులు రానున్నాయని... మౌలిక సదుపాయాలపై భారీగా ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు.
పోర్టులున్నాయి.. కారిడార్లు వస్తున్నాయి
రాష్ట్రంలో రియాల్టి రంగంలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ క్రమంలో అమరావతి, విశాఖ, తిరుపతి వంటి ప్రాంతాల్లో కూడా బిజినెస్ ఐటీ పార్కులు, మాల్స్, హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లతో పాటు ఉన్నతశ్రేణి వర్గాలకు హౌసింగ్ ప్రాజెక్టులను చేపట్టేందుకు అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో నిర్మితం అవుతున్న పారిశ్రామిక కారిడార్లు, పోర్టులకు అనుసంధానంగా ఇండస్ట్రియల్ టౌన్ షిప్, హౌసింగ్ ప్రాజెక్టులకు అవకాశం ఉందని శోభా రియాల్టీ చైర్మన్ రవి పీఎన్సీ మీనన్ కు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్భంగా శోభా గ్రూప్ సంస్థ చేస్తున్న ఛారిటీని సీఎం అభినందించారు. తమ ఆదాయంలో 50 శాతాన్ని ఛారిటీగా ఖర్చు పెట్టడాన్ని ప్రస్తావిస్తూ తాము ఏపీలో పీ4 విధానాన్ని అవలంభిస్తూ అమలు చేస్తున్న జీరో పావర్టీ మిషన్ అంశాలను వివరించారు. తమ సంస్థ దుబాయ్ తో పాటు ఓమన్, బహ్రెయిన్, ఖతార్, బ్రూనై దేశాల్లో ప్రాజెక్టులు నిర్వహిస్తోందని శోభా గ్రూప్ చైర్మన్ రవి మీనన్ ముఖ్యమంత్రికి వివరించారు. భారత్ లోని 14 రాష్ట్రాల్లోని 27 నగరాల్లో శోభా రియాల్టీ ప్రాజెక్టులు చేస్తోందని.. ప్రత్యేకించి బెంగుళూరు, గుర్గాంవ్, చెన్నై, కేరళలోని హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టామని సీఎంకు తెలిపారు. వచ్చే నెల నవంబర్14, 15వ తేదీల్లో విశాఖలో పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నామని...ఆ సదస్సుకు రావాలని సీఎం చంద్రబాబు ఆహ్వానించారు.