అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను ఉచితంగా తీసుకోవడానికి ఇవాళే చివరి తేదీ. ఇప్పటికీ తీసుకోకపోతే ఆ కార్డులను కమిషనరేట్కు పంపుతారు. అయితే రేషన్కార్డుదారులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. సచివాలయాల్లో రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకుంటే నేరుగా ఇంటికే పంపిస్తామని అధికారులు తెలిపారు. ఏటీఎం తరహాలోని ఈ కార్డులపై ఉండే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే కుటుంబం పూర్తి వివరాలు తెలుస్తాయి.
ఉచితంగా రేషన్ కార్డుల పంపిణీకి ఇవాళ ఒక్క రోజు మాత్రమే సమయం ఉండడంతో తీసుకోనివారు వెంటనే తీసుకోవాలని ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు విజ్ఞప్తి చేసింది. గడువులోగా కార్డులు తీసుకోకపోతే కార్డులు కమిషనరేట్కు వెనక్కి వెళ్లిపోతాయని అధికారులు చెబుతున్నారు. కొంతమంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వంటి ఇతర కారణాల వల్ల సిబ్బంది ఇంటింటికీ తిరిగినా కార్డులను అందించలేకపోయారని తెలుస్తోంది. మరోవైపు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కార్డు మంజూరు కాగా ఈ నెల నుంచే రేషన్ ఇస్తున్నారు.
కానీ వీరికి స్మార్ట్ కార్డులు రాలేదు. గడువు ముగుస్తుండడంతో తమ కార్డుల పరిస్థితి ఏమిటని వారు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే.. రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీలో కీలక మార్పులు చేసేందుకు నిర్ణయించింది. వచ్చే జనవరి నుంచి రేషన్ దుకాణాల ద్వారా గోధుమపిండి, రాగులు కూడా అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక ఊరట కలగనుంది.